కిడ్నాపర్‌ కాదు.. బాధితుడే..   

28 Apr, 2018 08:42 IST|Sakshi
యువకున్ని తండ్రికి అప్పగిస్తున్న పోలీసులు

పోలీసుల విచారణలో అసలు విషయం బహిర్గతం

యువకుడిని తండ్రికి అప్పగించిన పోలీసులు

జమ్మికుంటరూరల్‌(హుజూరాబాద్‌) : జమ్మికుంట మండలం కొత్తపల్లిలో చిన్నారులను ఎత్తుకెళ్తున్నాడని పోలీసులకు అప్పగించిన యువకుడు కిడ్నాపర్‌కాదు.. తానూ బాధితుడే అని పోలీసుల విచారణలో వెల్లడైంది. దీంతో ఆ యువకుడిని తండ్రికి అప్పగించారు. జమ్మికుంట మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన గండు సౌమ్య– చంద్రశేఖర్‌ల ఇద్దరు కవల పిల్లలైన రిత్విక్‌రెడ్డి, సాత్విక్‌రెడ్డి  ఈ నెల 23న ఇంటి ఎదుట ఆడుకుంటున్నారు.

వారిని ఎత్తుకెళ్లేందుకు యత్ని ంచిన పశ్చిమబెంగాల్‌ రాష్ట్రానికి చెందిన యువకుడు కూడా ఆ రాష్ట్రంలో కిడ్నాప్‌కు గురైనట్లు పోలీసులు తెలిపారు. శుక్రవారం టౌన్‌ సీఐ కార్యాలయంలో సీఐ ప్రశాంత్‌రెడ్డి వివరాలు వెల్లడించారు. పిల్లలను కిడ్నాప్‌కు యత్నించిన యువకుడిని విచారించగా.. అతడి పేరు శీతల్‌బౌలి అలియాస్‌ సొత్తు అని, స్వగ్రామం పశ్చిమబెంగాల్‌ రాష్ట్రం బీర్‌బూమ్‌ జిల్లా రాంపూర్‌ హట్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని బేల్‌పహారీని తెలిసిందన్నారు.

దీంతో అక్కడి పోలీసుకు సమాచారం ఇవ్వగా పలు విషయాలు వెల్లడయ్యాయని వివరించారు. బేల్‌ పహారీ గ్రామానికి చెందిన జితేనా అనే యువకుడు హైదరాబాద్‌లో పని కల్పిస్తానని శీతల్‌బౌలిని 2017లో తన వెంట తీసుకెళ్లాడని చెప్పారు. అప్పటి నుంచి జితేన్‌తో పాటు శీతల్‌బౌలి అడ్రస్‌లేకుండా పోయారన్నారు. వారి తల్లి, దండ్రులు పలుచోట్ల వెతికినా ఆచూకీ లభ్యం కాలేదని, చివరికి తన కొడుకును జితేన్‌ కిడ్నాప్‌ చేశాడంటూ శీతల్‌బౌలి తండ్రి సపన్‌బౌలి ఈ ఏడాది ఏప్రిల్‌ 1న రాంపూర్‌ హట్‌ పోలీస్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు.

కాగా ఇక్కడి పోలీసులు  రాంపూర్‌ హట్‌ పోలీస్‌స్టేషన్‌కు సమాచారం ఇవ్వడంతో ఏఎస్‌ఐ వివేకానంద ముఖర్జి, యువకుడి తండ్రి సపన్‌బౌలి జమ్మికుంట స్టేషన్‌కు వచ్చారు. సదరు యువకుడి మానసిక పరిస్థితి సరిగా లేదని, అందుకు సంబంధించిన వైద్య పత్రాలు చూపించారు. సీపీ కమలాసన్‌రెడ్డి ఆదేశాలతో శీతల్‌బౌలిపై కేసు కొట్టివేసి తన తండ్రికి అప్పగించారు.   

మరిన్ని వార్తలు