అతడు సైకో కిల్లర్‌

18 Mar, 2018 07:49 IST|Sakshi
సైకో కిల్లర్‌ మున స్వామి

పోలీసులకు చిక్కిన వరుస హత్యల నిందితుడు

ఒకటా.. రెండా.. ఎనిమిది మందిని హతమార్చిన కిరాతకుడు

తమిళనాడులో ఆరు, జిల్లాలో రెండు దారుణ హత్యలు

మునస్వామిని చాకచక్యంగా పట్టుకున్న పోలీసులు

చిత్తూరు అర్బన్‌ : ఫిబ్రవరి 25.. నగరి మండలంలోని వికెఆర్‌.పురం వద్ద ఇంట్లో ఒంటరిగా నిద్రిస్తు న్న రత్నమ్మ (62) దారుణ హత్యకు గురైం ది. తలపై బండరాయి వేసి హత్య చేశారు. వివస్త్రను చేయడమేగాక ఆమె శరీరంపై పలుచోట్ల పంటిగాట్లు ఉండడాన్ని పోలీసులు గుర్తించారు. ఈ నెల 9వ తేదీ అర్ధరాత్రి పాలసముద్రం మండలం గంగమాంబపురం పంచాయతీ అభిరాజుకండ్రిగ గ్రామ శివారుల్లో ఉన్న ఇంట్లో వళ్లియమ్మ (65) నిద్రించింది. ఉదయం కూతురు వచ్చి చూసేసరికి వళ్లియమ్మ రక్తపు మడుగులో ఉంది. ఆమె శరీరంపై కూడా అదే ఆనవాళ్లు. హత్యలు చేస్తున్నది ఒక్కరేనని పోలీసులు నిర్ధారిం చుకున్నారు. అది కూడా సైకో కిల్లర్‌గా ఉన్నాడని అనుమానాలు వ్యక్తం చేశారు.

ఈ రెండు హత్యల్లో నిందితుడిని చిత్తూరు పోలీసులు పట్టుకున్నారు. గ్రామాల శివారులో ఉన్న ఇళ్లను లక్ష్యంగా చేసుకుని ఒంటరిగా ఉన్న వృద్ధురాళ్లను హత్య చేసి లైంగిక దాడి చేస్తున్న సీరియల్‌ సైకో కిల్లర్‌ను మన పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. శనివారం తమిళనాడులోని షోలింగర్‌ వద్ద ఉన్న నిందితుడు మునస్వామి (40)ని అదుపులోకి తీసుకుని చిత్తూరుకు తరలించారు. ప్రాథమిక సమాచారం ఎస్పీ రాజశేఖర్‌బాబుకు తెలియడంతో అధికారులను అభినందించారు. నిందితుడు ఇదే తరహాలో తమిళనాడులోని పలు ప్రాంతాల్లో ఆరు హత్యలు చేసినట్లు ప్రాథమిక విచారణలో సమాచారం రాబట్టిన అధికారులు నిర్ఘాంతపోయారు.

ఇలా చిక్కాడు..
నగరిలో రత్నమ్మను హత్య చేసిన తరువాత మునస్వామి బస్సుల్లో తిరుగుతూ ఈ నెల 8న పాలసముద్రం చేరుకున్నాడు. ఇతనిది షోలింగర్‌ కావడంతో ఊరికి వెళ్లే దారిలో ఒంటరిగా ఉన్న వళ్లియమ్మను బండరాయితో హత్య చేశాడు. అనంతరం నడుచుకుంటూ తమిళనాడు వెళ్లిపోయాడు. ఆంధ్ర–తమిళనాడు సరిహద్దులో ఉన్న ఓ పెట్రోలు బంకు వద్ద ఏర్పాటు చేసిన సీసీ కెమెరా పుటేజీలో మునస్వామి అర్ధరాత్రి వెళ్లడాన్ని పోలీసులు గుర్తించారు. వారం రోజులుగా వేలూరు, షోలింగర్, ఆర్కాడు ప్రాంతాల్లో గాలింపు చేపట్టారు. ఆయా పోలీస్‌ స్టేషన్లలో వేలిముద్రల ఆధారంగా పాత నేరస్తుడి వివరాలను మన పోలీసులు సేకరించారు. ఇందులో మునస్వామి ఉన్నట్లు గుర్తించి షోలింగర్‌ వద్ద ఉన్న అతన్ని అదుపులోకి తీసుకున్నారు. పూర్తి స్థాయిలో విచారించిన తరువాత అరెస్టు చూపే అవకాశం ఉంది. 

మరెన్నో కేసులు..
మునస్వామిపై తమిళనాడులోని తిరువళ్లూరు, వేలూరు తదితర ప్రాంతాల్లో చోరీలతోపాటు హత్యాయత్నం కేసులు నమోదయ్యాయి. వీటిల్లో కొన్ని కేసులు న్యాయస్థానంలో రుజువుకాకపోగా.. మరికొన్నింటిలో బెయిల్‌పై బయటకొచ్చి కోర్టు వాయిదాలకు హాజరుకాకుండా తప్పించుకుని తిరుగుతున్నాడు. మరోవైపు తిరువళ్లూరు, షోలింగర్, అరక్కోణం, వేలూరు ప్రాంతాల్లో దాదాపు ఆరు హత్యలకు పాల్పడినట్టు నిందితుడు అంగీకరించినట్లు సమాచారం.

పట్టుకోకుంటే మరిన్ని హత్యలు...
చిత్తూరు జిల్లాలో జరిగిన రెండు హత్య కేసుల్ని పరిశీలించిన పోలీసులు ఒకే వ్యక్తి దారుణానికి ఒడిగట్టినట్టు నిర్ధారణకు వచ్చారు. పైగా హత్యానంతరం వృద్దుల ఛాతీపై పళ్లగాట్లు ఉండటంతో అతను సైకో అని తెలుసుకుని విస్తుపోయారు. ఈ వ్యవహారాన్ని జాగ్రత్తగా డీల్‌ చేయాలని ఎస్పీ రాజశేఖర్‌బాబు ఆదేశించడంతో ఓ ప్రత్యేక బృందం రంగంలోకి దిగింది. వారం రోజుల పాటు విచారించి మాటువేసి నిందితుడ్ని పట్టుకున్నారు. మునస్వామిని పట్టుకోకుంటే మరిన్ని హత్యలు జరిగి ఉండేవని పోలీసులు చెబుతున్నారు. విషయం తెలుసుకున్న తమిళనాడు పోలీసులు చిత్తూరుకు వచ్చి కేసుపై మన పోలీసులతో విచారిస్తున్నారు. 

మరిన్ని వార్తలు