కీచక హెచ్‌ఎంను చితకబాదిన తల్లిదండ్రులు

4 Mar, 2020 10:48 IST|Sakshi
పాఠశాలలో విచారిస్తున్న డీఎస్పీ జయరామసుబ్బారెడ్డి

పోలీసులకు ఫిర్యాదు చేసిన తల్లిదండ్రులు

హెచ్‌ఎంపై ఫోక్సో కేసు నమోదు చేసిన పోలీసులు

చీరాల రూరల్‌: విద్యార్థినులకు విద్యాబుద్ధులు నేర్పించి వారి బంగారు భవిష్యత్‌కు బాటలు వేయాల్సిన పాఠశాల ప్రధానోపాధ్యాయుడే ఆ విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తిస్తూ కీచకుడిలా మారడంతో స్థానికులు ఆ అయ్య వారిని పాఠశాలలోనే చితకబాది పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సంఘటన మంగళవారం ఈపురుపాలెంలో జరిగింది. విద్యార్థినుల తల్లిదండ్రులు, పోలీసుల కథనం ప్రకారం.. ఈపురుపాలెం పద్మనాభునిపేట మండల పరిషత్‌ పాఠశాలలో హెచ్‌ఎంగా విధులు నిర్వర్తిస్తున్న జె.నాగభూషణం కొంతకాలంగా మూడు నుంచి ఐదో తరగతి చదివే విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు. వికృత చేష్టలు చేస్తున్నాడు. విద్యార్థినులకు ముద్దులు పెట్టడం వంటి వెకిలి చేష్టలకు పాల్పడుతున్నాడు. అతడి వేధింపులు భరించలేని అభంశుభం తెలియని చిన్నారులు స్కూల్లో జరుగుతున్న అకృత్యాలను తల్లిదండ్రులకు చెప్పుకుని బాధపడ్డారు.

తల్లిదండ్రుల్లో కట్టలు తెచ్చుకున్న ఆగ్రహం 
చిన్నారుల ఆవేదనను విన్న తల్లిదండ్రుల్లో ఆగ్రహం కట్టలు తెచ్చుకుంది. మంగళవారం పాఠశాలకు చేరుకుని హెచ్‌ఎం నాగభూషణాన్ని ప్రశ్నించారు. అనంతరం హెచ్‌ఎంను చితకబాదారు. అంతటితో ఆగని తల్లిదండ్రులు ఈపురుపాలెం పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం పాఠశాల ఎదుట ఆందోళనకు దిగారు. సమాచారం అందుకున్న డీఎస్పీ వై.జయరామ సుబ్బారెడ్డి, ఎస్‌ఐ వి.సుధాకర్, మండల విద్యా శాఖాధికారిలు సంఘటన స్థలానికి చేరుకుని ఆరా తీశారు. విద్యార్థినులు, తల్లిదండ్రులతో విడివిడిగా మాట్లాడారు. కీచక హెచ్‌ఎం నాగభూషణాన్ని అదుపులోకి తీసుకుని పోలీసుస్టేషన్‌కు తరలించారు. విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తించిన హెచ్‌ఎంపై ఫోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ జయరామసుబ్బారెడ్డి తెలిపారు.

మరిన్ని వార్తలు