‘స్కీమ్స్‌’ స్కామ్‌లో డాక్టర్‌ నౌహీరా షేక్‌ అరెస్టు

17 Oct, 2018 01:20 IST|Sakshi

     పలువురి వద్ద డిపాజిట్లు వసూలు చేసి మోసం చేసినట్లు ఆరోపణలు 

     దేశవ్యాప్తంగా ఎనిమిది రాష్ట్రాల్లో బాధితులు 

     రూ.వందల కోట్లు దారి మళ్లించినట్లు అనుమానాలు 

     ఎట్టకేలకు అరెస్టు చేసిన సిటీ సీసీఎస్‌ పోలీసులు 

సాక్షి, హైదరాబాద్‌ : ఆలిండియా మహిళా ఎంపవర్‌మెంట్‌ పార్టీ (ఎంఈపీ) వ్యవస్థాపక అధ్యక్షురాలు, హీరా గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీస్‌ చైర్‌ పర్సన్‌ డాక్టర్‌ నౌహీరా షేక్‌ను హైదరాబాద్‌ సెంట్రల్‌ క్రైమ్‌ స్టేషన్‌ (సీసీఎస్‌) పోలీసులు అరెస్టు చేశారు. వివిధ స్కీముల పేరుతో వేల మంది నుంచి డిపాజిట్లు సేకరించి మోసం చేశారనే ఆరోపణలు ఆమెపై ఉన్నాయి. నౌహీరాపై ఆరేళ్ల క్రితం నమోదైన కేసు దర్యాప్తులో ఉండగా.. తాజాగా రిజిస్టరైన మరో కేసులో ఆమెను కటకటాల్లోకి పంపినట్లు నగర పోలీసు కమిషనర్‌ అంజనీ కుమార్‌ మంగళవారం వెల్లడించారు. నౌహీరా వద్ద డిపాజిట్‌ చేసిన వారిలో తెలంగాణతో సహా మొత్తం ఎనిమిది రాష్ట్రాలకు చెందిన వారు ఉన్నారని, ఈమెపై మూడు రాష్ట్రాల్లో కేసులు నమోదైనట్లు ఇప్పటి వరకు గుర్తించామని ఆయన తెలిపారు.అదనపు సీపీ షికా గోయల్, డీసీపీ అవినాశ్‌ మహంతి, అదనపు డీసీపీ జోగయ్యలతో కలసి తన కార్యాలయంలో విలేకరులకు ఆయన పూర్తి వివరాలు వెల్లడించారు.

ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతికి చెందిన నౌహీరా షేక్‌ కొన్నేళ్ల కిందట హైదరాబాద్‌కు వలసవచ్చి బంజారాహిల్స్‌లో స్థిరపడ్డారు. గతేడాది నవంబర్‌లో ఆమె ఎంఈపీని స్థాపించారు. కొన్నేళ్లుగా హీరా గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీస్‌ నిర్వహిస్తున్న నౌహీరా అదీనంలో ప్రస్తుతం 15 కంపెనీలు ఉన్నాయి. వీటిలో అనేక కంపెనీలు ప్రస్తుతం డిపాజిట్లు సేకరించే వ్యాపారం చేస్తున్నాయి. 2010–11 ఆర్థిక సంవత్సరంలో తమ వార్షిక టర్నోవర్‌ కేవలం రూ.17 కోట్లుగా పేర్కొన్న ఈ కంపెనీ గతేడాది ఏకంగా రూ.800 కోట్లుగా పేర్కొంది. వివిధ పథకాల్లో పెట్టుబడులు, చైన్‌ సిస్టమ్‌లో బంగారం కొనుగోలు, ఏడాదికి 36 శాతం వడ్డీ అందించేలా పెట్టుబడులు... తదితర స్కీములు ప్రవేశపెట్టిన హీరా గ్రూప్‌ అనేక మంది నుంచి వాటిని సేకరించింది. కనీస డిపాజిట్‌ మొత్తాన్ని రూ.50 వేలుగా నిర్ధారించి వసూలు చేసింది. తెలంగాణతో పాటు ఏపీ, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, పశ్చి మ బెంగాల్, ఢిల్లీ, రాజస్తాన్‌ రాష్రా ్టలు, దుబాయ్, మధ్య ఆసియా దేశాల్లోనూ బ్రాంచ్‌లు ఏర్పాటు చేసింది.

ఇలా దాదాపు రూ.300 కోట్ల వరకు డిపాజిట్లు వసూలు చేసి తిరిగి చెల్లించకుండా మోసం చేసినట్లు ఆరోపణలు ఉన్నా యి. ఓ బాధితుడి ఫిర్యాదు మేరకు దాదాపు 40 రోజుల క్రితం బంజారాహిల్స్‌ ఠాణాలో కేసు నమోదైంది. దీంతో పాటు మరో పది మంది బాధితులు సైతం పోలీసుల వద్దకు వచ్చి వాం గ్మూలం ఇచ్చారు. ప్రాథమిక దర్యాప్తులోనే ఈ స్కామ్‌ రూ.5 కోట్లదిగా తేలడంతో పాటు మరికొన్ని స్కీమ్స్‌ వెలుగులోకి రావడంతో కేసును సీసీఎస్‌కు బదిలీ చేశారు. దర్యాప్తు చేసిన ఏసీపీ కె.రామ్‌కుమార్‌ లోతుగా ఆరా తీశారు. ఫలితంగా డిపాజిటర్ల నుంచి సేకరించిన డబ్బు ను మళ్లించిన నౌహీరా షేక్‌ దాంతో స్థిరాస్తులు ఖరీదు చేసినట్లు గుర్తించారు. వీటిని తనతో పాటు మరికొందరు బినామీలు, సంస్థల పేరుతో కొన్నట్లు తేల్చారు.

ఈ ఆధారాలను బట్టి నౌహీరా నేరం చేసినట్లు నిర్ధారించిన పోలీసులు ఆమె కోసం ముమ్మరంగా గాలించారు. ఎట్టకేల కు సోమవారం ఢిల్లీలో ఆమె కదలికల్ని గుర్తిం చి ఓ ప్రత్యేక బృందాన్ని అక్కడకు పంపారు. ఈ టీమ్‌ నౌహీరాను అరెస్టు చేసి అక్కడి సాకేత్‌ కోర్టులో హాజరుపరిచి ట్రాన్సిట్‌ వారెంట్‌ తీసుకున్నారు. మంగళవారం నౌహీరాను హైదరాబాద్‌కు తీసుకువచ్చి కోర్టులో హాజరుపరిచారు. ప్రాథమికంగా ఆమెతో పాటు కంపెనీల పేరుతో ఉన్న 160 బ్యాంకు ఖాతాలను గుర్తించిన పోలీసులు వాటిని ఫ్రీజ్‌ చేసి అధ్యయనానికి సన్నాహాలు చేస్తున్నారు. మరోపక్క డిపాజిటర్ల సొ మ్ముతో నౌహీరా ఖరీదు చేసిన 43 స్థిరాస్తుల్ని గుర్తించిన పోలీసులు వాటిని స్వాధీనం చేసుకోవడంపై దృష్టి పెట్టారు.నౌహీరాపై విశాఖపట్నంలో 2, బెంగళూరులో ఏడు కేసులు ఉన్నట్లు ఇప్పటి వరకు తెలిసిందని, మరిన్ని వివరాలు దర్యాప్తు చేస్తున్నామని అంజనీకుమార్‌ తెలిపారు. 

మరిన్ని వార్తలు