సాక్షి, జగిత్యాల : ఓ పెళ్లింట కలకలం చెలరేగింది. పెళ్లి కుమారుడికి ఇది వరకే పెళ్లయిందని తెలియటంతో వివాదం చోటుచేసుకుంది. ఈ సంఘటన ఆదివారం జగిత్యాల జిల్లాలోని పోరండ్లలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు... జగిత్యాల జిల్లాకు చెందిన రాజశేఖర్కు పోరండ్లకు చెందిన ఓ యువతితో నిన్న వైభవంగా పెళ్లి జరిగింది. అయితే రాజశేఖర్తో తనకు గతంలోనే పెళ్లి అయిందంటూ ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరుకు చెందిన ఓ యువతి పోలీసులను ఆశ్రయించింది. వరుడి నిర్వాకం బయటపడటంతో వధువు బంధువులు...రాజశేఖర్ను గదిలో బంధించి తమకు న్యాయం చేయాలంటూ ఆందోళన చేపట్టారు. మరోవైపు ఉట్నూరు యువతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.