బాలికపై హోంగార్డు లైంగిక దాడి

23 Feb, 2020 04:58 IST|Sakshi

ఏడాదిగా కొనసాగుతున్న దుశ్చర్య

బాలిక గర్భం దాల్చడంతో వెలుగులోకి దారుణం

చిలకలపూడి పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు

సాక్షి, మచిలీపట్నం: ప్రేమపేరుతో పరిచయం పెంచుకున్నాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి 15 ఏళ్ల బాలికను గర్భవతిని చేశాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఖాకీ ముసుగులో ఏడాదిగా ఆ కామాంధుడు సాగిస్తున్న లైంగిక దాడి వ్యవహారం వెలుగుచూసింది. వివరాలిలా ఉన్నాయి. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో హోంగార్డుగా పనిచేస్తున్న బి.ఫణీంద్రబాబు (హెచ్‌జీ –254) స్థానిక బైపాస్‌ రోడ్డులోని టెంపుల్‌ కాలనీలో నివాసం ఉంటున్నాడు.  డీఎస్పీ జీపు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. తాను ఉంటున్న కాలనీలోనే 15 ఏళ్ల బాలికపై కన్నేశాడు. తల్లిదండ్రులు స్థానిక రైతుబజార్‌లో కూరగాయలు వ్యాపారం చేసుకుంటుండగా ఆ బాలిక అదే కాలనీలో  కూల్‌డ్రింక్‌ షాపు నడుపుకుంటూ జీవనం పోషించుకునే అక్క వద్ద ఉంటోంది.

షాపులో ఉన్న సమయంలో ప్రేమ పేరుతో మాయమాటలు చెప్పి ఫణీంద్రబాబు ఆ బాలికను లోబర్చుకున్నాడు. ఆ బాలిక ఒంటరిగా ఉంటున్న సమయంలో ఇంటికి వెళ్లి తన అవసరాలు తీర్చుకునే వాడు. కొంత కాలంగా తరచూ కడుపునొప్పి వస్తుందని తల్లిదండ్రులకు చెప్పడంతో వారు స్థానిక పీహెచ్‌సీ వద్దకు తీసుకెళ్లి వైద్య పరీక్షలు నిర్వహించగా ఐదు నెలల గర్భవతి అని తేలింది. దీంతో బాలిక తల్లిదండ్రులు శనివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు.

వెంటనే ఫణీంద్రపై 49/2020 అండర్‌ సెక్షన్‌ 376, ఐపీసీ, పోక్సో కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుడ్ని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ కేసుకు సంబంధించి చిలకలపూడి సీఐ ఎం.వెంకటనారాయణ ఇచ్చిన నివేదిక ఆధారంగా హోంగార్డును విధుల నుంచి తొలగిస్తూ ఎస్పీ ఆదేశాలు జారీ చేశారు. నేరానికి పాల్పడితే సామాన్యులకైనా, పోలీసు శాఖలో పనిచేసే సిబ్బందికైనా చట్టం సమానంగా వర్తిస్తుందని, చట్టం దృష్టిలో అందరూ సమానమేనని ఎస్పీ రవీంద్రబాబు స్పష్టం చేశారు.  

మరిన్ని వార్తలు