రాజధానిలో మానవ మృగం...

17 Jul, 2018 08:19 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: సమాజం సిగ్గుతో తలదించుకునే ఘటన. డ్రగ్స్‌ మత్తులో మానవత్వం మాయమైంది.. అతడిలో మృగం నిద్రలేచింది. ఆరేళ్ల పసికందును అతికిరాతకంగా చెరచటంతో ఆ చిన్నారి ప్రాణపాయస్థితిలో కొట్టుమిట్టాడుతోంది. దేశరాజధానిలో జరిగిన ఘటన వివరాల్లోకి వెళ్తే... 

మింటో రోడ్‌లోని కాళిమందిర్‌ వద్ద ఉన్న ఫుట్‌పాత్‌పై ఓ రిక్షా కార్మికుడి కుటుంబం నివసిస్తోంది. భార్య గుడి దగ్గర భిక్షాటన చేస్తుండగా, వారికి ఆరేళ్ల పాప ఉంది. అదే ఫుట్‌పాత్‌పై ఓ యువకుడు కూడా జీవిస్తున్నాడు. గత కొంతకాలంగా డ్రగ్స్‌కు బానిసైన ఆ యువకుడు.. ఆ చిన్నారిపై కన్నేశాడు. ఈ నెల 14న సదరు యువకుడు ఆ చిన్నారి ఎత్తుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఆడుకుంటున్నకూతురు కనిపించపోయేసరికి కంగారుపడ్డ ఆ తల్లిదండ్రులు చుట్టుపక్కల గాలించారు. కాస్త దూరంలోని పొదల్లో రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతున్న చిన్నారి కనిపించటంతో షాక్‌కి గురయ్యారు.

హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా 4 గంటలపాటు వైద్యులు శస్త్రచికిత్స చేశారు. చిన్నారి పరిస్థితి విషమంగానే ఉందని వైద్యులు చెబుతున్నారు. ఈ ఘటనపై స్పందించిన ఢిల్లీ మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ స్వాతి మలివాల్‌.. ఆ చిన్నారి తల్లిదండ్రులను పరామర్శించి ఓదార్చారు. చిన్నారి కుటుంబానికి ఆర్థిక సాయం అందించేందుకు ముందుకు రావాలని, నిందితుడిని కఠినంగా శిక్షించాలని ఆమె పోలీసులను కోరుతున్నారు. రాజధానిలో మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయని ఆమె ఆవేదన చెందుతూ ఓ ట్వీట్‌ చేశారు.

మరిన్ని వార్తలు