హైదరాబాద్‌లో ఎయిర్‌హోస్టెస్‌ నిర్వాకం

31 Oct, 2019 12:58 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : హనీట్రాప్‌తో బాధితుడి నుంచి లక్షల రూపాయలు కొల్లగొట్టిన ఓ ఎయిర్‌హోస్టెస్‌ను, ఆమె భర్తను పోలీసులు గురువారం అరెస్టు చేశారు. బాధితుడిని బ్లాక్‌మెయిల్‌ చేసి డబ్బు వసూలు చేయడంతో పాటుగా తుపాకీతో అతడిని బెదిరించిన కేసులో వారిని అదుపులోకి తీసుకున్నారు. వివరాలు.. కనిష్క అనే మహిళ గతంలో ఎయిర్‌హోస్టెస్‌గా పనిచేసింది. ఈ క్రమంలో విలాసవంతమైన జీవితానికి అలవాటు పడిన కనిష్క, ఆమె భర్త విజయ్‌కుమార్‌ సులభంగా డబ్బు సంపాదించే మార్గాలను అన్వేషించారు. ఇందులో భాగంగా కనిష్క ఓ వ్యాపారవేత్తను ట్రాప్‌ చేసింది. పరిచయం పెంచుకుని అతడిని రెస్టారెంట్లు, పార్కులకు తీసుకువెళ్లేది. ఈ క్రమంలో శంకర్‌పల్లి రిసార్ట్‌లో రూం బుక్‌ చేసిన కనిష్క.. వ్యాపారిని అక్కడికి పిలిపించింది. అప్పటికే అక్కడికి చేరుకున్న కనిష్క భర్త సహాయంతో అతడికి మత్తు మందు ఇచ్చింది. అనంతరం వారిద్దరు నగ్నంగా ఉన్న దృశ్యాలను విజయ్‌కుమార్‌ సెల్‌ఫోన్‌లో చిత్రీకరించాడు. ఆ తర్వాత రాసలీలకు సంబంధించిన దృశ్యాలు సదరు వ్యాపారవేత్తకు పంపించి బ్లాక్‌మెయిల్‌ చేయడం మొదలుపెట్టారు. 

ఈ నేపథ్యంలో కనిష్క దంపతులకు బాధితుడు రూ. 20లక్షలు ఇచ్చాడు. అయినప్పటికీ వాళ్లు అతడిని విడిచిపెట్టలేదు. రూ. కోటి ఇవ్వాలంటూ బాండ్‌ రాయించుకున్నారు. దీంతో విసుగెత్తిపోయిన బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. కనిష్క దంపతులపై కేసు నమోదు చేసిన పోలీసులు విజయ్‌కుమార్‌ను అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. ఈ మేరకు శంషాబాద్‌ డీసీపీ ప్రకాశ్‌రెడ్డి వివరాలు వెల్లడించారు. కాగా వీరు గతంలో కూడా ఓ మతప్రచారకుడిని ఈ విధంగానే హనీట్రాప్‌ చేసి లక్షలాది రూపాయలు కొల్లగొట్టినట్లు సమాచారం. అంతేగాకుండా మరో ఎన్నారైని కూడా వీరు టార్గెట్‌ చేసినట్లు తెలుస్తోంది.

మరిన్ని వార్తలు