సావంత్‌కు ‘సవతి’ షాక్‌!

5 Jan, 2018 09:31 IST|Sakshi

రోహ్‌తక్‌ : డేరా బాబా గుర్మీత్‌ రామ్‌రహీమ్‌ సింగ్‌ దత్తపుత్రిక, పంచకుల అల్లర్ల కేసులో ప్రధాన నిందితురాలు అయిన హనీప్రీత్‌ ఇన్సాన్‌ మరోసారి వార్తల్లో నిలిచారు. డేరా బాబా-హనీప్రీత్‌ల అనుబంధంపై ‘సవతి’ వ్యాఖ్యలు చేసిన ప్రముఖ నటి రాఖీ సావంత్‌పై పరువునష్టం దావా దాఖలైంది. హనీప్రీత్‌ తల్లి ఆశా తనేజా ఇచ్చిన ఫిర్యాదుమేరకు కేసు నమోదయినట్లు రోహ్‌తక్‌ పోలీసులు తెలిపారు. రాఖీ ప్రధాన పాత్రలో గుర్మీత్‌-హనీలపై రూపుదిద్దుకున్న సినిమా మరికొద్ది రోజుల్లో విడుదల కానున్న నేపథ్యంలో తాజా వివాదం చర్చనీయాంశమైంది.

రూ.5కోట్లు డిమాండ్‌ : ‘‘నటి రాఖీ సావంత్‌ అడ్డగోలుగా మాట్లాడి నా కూతురి(హనీప్రీత్‌) పరువుతీసింది. తప్పును ఒప్పుకుని 30 రోజుల్లోగా క్షమాపణలు చెప్పిందా సరేసరి. లేదంటూ రూ.5 కోట్లు చెల్లించాలి’’ అని ఆశా తనేజా డిమాండ్‌ చేశారు.

అసలు రాఖీ ఏమంది? : గత ఆగస్టులో గుర్మీత్‌, హనీప్రీత్‌లు అరెస్టయిన సందర్భంలో రాఖీ సావంత్‌ మీడియాతో మాట్లాడుతూ వారి అనుబంధంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘ఒక దశలో నేను(రాఖీ) డేరా బాబాకు చాలా దగ్గరయ్యాను. మా ఇద్దరిదీ పవిత్రబంధం. ఎందుకోగానీ హనీప్రీత్‌కు ఇది నచ్చేదికాదు. బాబాకు నాకు మధ్య సాన్నిహిత్యాన్ని ఆమె(హనీ) జీర్ణించుకోలేకపోయేది. ఆయనను పెళ్లి చేసుకుంటే ఎక్కడ సవతిని అవుతానోనని హనీ భయపడేది’’ అంటూ రాఖీ బాంబు పేల్చారు. తద్వారా గుర్మీత్‌-హనీప్రీత్‌లది తండ్రీకూతుళ్ల బంధం కాదని బయటపెట్టేయత్నం చేశారు.

జైలులోని గుర్మీత్‌, హనీప్రీత్‌ : లైంగికదాడి కేసులో 20 ఏళ్ల శిక్ష పడటంతో డేరా బాబా గుర్మీత్‌ జైలుకు వెళ్లారు. ఆయనకు శిక్ష ఖరారు సమయంలో పంచకుల, రోహ్‌తక్‌ సహా హరియాణాలోని పలు పట్టణాలు, పంజాబ్‌లోని ఒకన్ని చోట్ల డేరా అనుచరులు హింసకు పాల్పడ్డారు. నాటి అల్లర్లలో 20మందికిపైగా చనిపోయారు. ఆయా కేసులకు సంబంధించి ప్రధాన నిందితురాలిగా ఉన్న హనీప్రీత్‌.. అనంతరకాలంలో అరెస్టయ్యారు. గుర్మీత్‌ నేరాలలోనూ ఆమెకు సంబంధాలున్నట్లు పోలీసు ద్యాప్తులో వెల్లడైంది.

మరిన్ని వార్తలు