ప్రాణం ఖరీదు రూ.2లక్షలు..?

20 Sep, 2019 10:45 IST|Sakshi
బాలిక మృత దేహం; ఆసుపత్రి  ఎదుట ఆందోళనకు దిగిన బంధువులు, నేతలు

సర్దుమనిగిన వివాదం

గురువారం ఉదయం మరోసారి ఉద్రిక్తత

16గంటల పాటు ఆస్పత్రి ఎదుట పోలీసుల పహారా

రూ.15లక్షలు డిమాండ్, రూ.2లక్షలకు కుదిరిన ఒప్పందం

సాక్షి, మంచిర్యాల: జిల్లా కేంద్రంలోని పలు ప్రైవేటు ఆసుపత్రులు ప్రాణాలకు ఖరీదు కడుతున్నాయి. ఇటీవల కాలంలో వైద్యుల నిర్లక్ష్యంతో పలువురు ప్రైవేటు ఆస్పత్రిలో  చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటనలు చోటుచేసుకోవడం జిల్లా ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. వేలాది రూపాయలను ఫీజుల రూపంలో తీసుకుంటూనే, ప్రాణాలకు గ్యారంటీని ఇవ్వలేని దుర్భర పరిస్థితుల్లో జిల్లా కేంద్రంలోని కొన్ని ప్రైవేటు ఆస్పత్రుల తీరు జిల్లా ప్రజల్లో కలవరం నెలకొంది.

జిల్లా కేంద్రంలో ఇటీవల పలు ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతూ మృతి చెందిన సంఘటనలు చోటుచేసుకున్నాయి. వైద్యుల నిర్లక్ష్యం అంటు బాధిత కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగడం... వీరికి మధ్యవర్తిత్వంగా వ్యవహరిస్తూ బాధితుల పక్షన నిలబడి ఆందోళనలు చేయడం... కుటుంబానికి న్యాయం చేయాలని లక్షల్లో డిమాండ్‌ చేయడం, చివరికి బాధితులకు ఎంతో కొంత ఇప్పించడం వైద్యులు సైతం ఈ గొడువలెందుకులే అని లక్షల్లో ముట్టజెప్పడం జిల్లా కేంద్రంలోని ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యాలు ప్రాణాలకు ఖరీదు కట్టడం పరిపాటిగా మారింది. ఇటీవల జిల్లా కేంద్రంలో పలు ప్రైవేటు ఆసుపత్రుల్లో జరిగిన సంఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి....

ఈ నెల 17 మంచిర్యాల మంచిర్యాల జిల్లా కేంద్రంలోని రాఘవేంద్ర పిల్లల ఆసుపత్రిలో ఆసిఫాబాద్‌ జిల్లా సిర్పూర్‌ టౌన్‌ మండలం డోర్‌పెల్లి గ్రామానికి చెందిన డోంగ్రీ సాయినాథ్‌ – తిరుమల కూతురు సంకీర్తణ (8) జ్వరం రావడంతో ఆస్పత్రిలో చేర్చారు. వైద్య పరీక్షల అనంతరం డెంగీ జ్వరం అని, ప్లేట్‌లేట్స్‌ 43వేలే ఉన్నాయని తెలిపారు. ఈ క్రమంలో చికిత్స పొదుతూ ఈ నెల 18న సాయంత్రం మృతి చెండడంతో వైద్యుల నిర్లక్ష్యమేనని కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు.

రూ. 2లక్షలకు ఒప్పందం...
విషయం తెలుసుకున్న స్థానికులు, కుటుంబ సభ్యులు చేరుకొని వైద్యుల నిర్లక్ష్యంతో బాలిక మృతి చెందినట్లు ఆరోపిస్తూ ఆందోళనకు దిగారు. దీంతో పోలీసులు. జోక్యం చేసుకుని ఇరువార్గాలతో మాట్లాడి ఆందోళన జరగకుండా చర్యలు తీసుకున్నారు. ఘటన స్థలంలో బాలిక తల్లిదండ్రులు ఇద్దరే ఉండడంతో మృత దేహాన్ని తీసుకెళ్లడానికి విముకత చూపించారు. తమ గ్రామం నుంచి తమకు చెందిన బంధువులు వచ్చేంత వరకు ఇక్కడి నుంచి వెళ్లమని రోదిస్తూ ఉండిపోయారు. గురువారం సాయినాథ్‌ కుటుంబ సభ్యులు ఆస్పత్రికి చేరుకుని మరోసారి ఆందోళన చేసేందుకు సిద్ధమయ్యారు. స్థానిక నేతలు కుటుంబానికి న్యాయం చేయాలంటూ రూ. 15లక్షలు పరిహారం అందజేయాలని డి మాండ్‌ చేశారు. ఆసుపత్రి యాజమాన్యం 3గంటల పాటు చర్చల అనంతరం రూ.2లక్షల ఇచ్చేదుకు అంగీకరించడంతో వివాదం సర్దుమనిగింది.

16గంటల పాటు పోలీస్‌ పహారా....
ఆసుపత్రి ఎదుట ఎలాంటి ఉద్రిక్తత వాతావరణం చోటుచేసుకుండా ఉండేందుకు ఈ నెల 18న రాత్రి 8గంటలకు ఆస్పత్రి వద్దకు చేరుకున్న పోలీసులు ఈ నెల19న ఉదయం11 గంటల వరకు అంటే 16గంటల పాటు పోలీసులు ఆసుపత్రి వద్ద ఎలాంటి అవాంఛనయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసు సిబ్బంది జాగ్రత్తలు తీసుకున్నారు. 

మరిన్ని వార్తలు