ప్రశ్నించిన కుమారుడిపై యాసిడ్దాడి
సంతోష్నగర్లో దారుణం
సంతోష్నగర్: తన తల్లి పోటోను సామాజిక మాధ్యమాలలో పోస్ట్ చేసి అసభ్యకర సందేశం ఎందుకు రాశావని ప్రశ్నించిన యువకుడిని ఇంటి యజమాని యాసిడ్ పోసి రాడ్తో దాడి చేశాడు. ఈ సంఘటన సంతోష్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇన్స్పెక్టర్ ఎ.భోజ్యానాయక్ తెలిపిన వివరాల ప్రకారం.....సంతోష్నగర్లోని రాజనర్సింహ్మానగర్ హనుమాన్ వీధికి చెందిన మహ్మద్ సర్వర్ ఖాన్ ఇంట్లో గత కొన్ని నెలలుగా మహ్మద్ అబ్దుల్ ఫారూఖ్ కుటుంబం అద్దెకు ఉండేది.
కొన్ని రోజుల క్రితం ఇంటిని ఖాళీ చేశారు. ఇదిలా ఉండగా ఫారూఖ్ తల్లికి సంబంధించిన ఫోటోను ఇంటి యజమాని సర్వర్ ఇన్స్ట్రాగామ్లో అప్లోడ్ చేయడంతో పాటు అసభ్యకర సందేశాన్ని కూడా రాశాడు. గమనించిన ఫారూఖ్ ఈ నెల 7న ఇంటి యజమాని వద్దకు వెళ్లి తన తల్లి పట్ల అలా ఎందుకు రాశావంటూ ప్రశ్నించాడు. దీంతో ఆగ్రహానికి గురైన సర్వర్ ఖాన్, కుటుంబ సభ్యులు తయ్యబా, ఆసీఫా బేగం, సుమయా తదితరులు ఆగ్రహంతో ఫారూక్ ఒంటిపై యాసిడ్ చల్లి...కారం పోసి....ఇనుప రాడ్తో దాడి చేశారు. ఈ ఘటనలో తీవ్ర గాయాలపాలైన ఫారూఖ్ అక్కడి నుంచి పరిగెత్తుకొచ్చి ప్రాణాలు దక్కించుకున్నాడు. ప్రస్తుతం ఓవైసీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. కాగా నిందితులు పరారీలో ఉన్నట్లు ఎస్సై రవి తెలిపారు.