భార్యతో గొడవపడ్డ భర్త

31 May, 2019 08:47 IST|Sakshi

ప్రశ్నించిన కానిస్టేబుల్‌కు చెంప దెబ్బ

తిరువొత్తియూరు: భార్యాభర్తల గొడవలో పరమేశ్వరుడు తలదూర్చినా తలనొప్పులు తప్పవన్న నానుడికి సరిగ్గా అబ్బేలా ఓ సంఘటన నగరంలో గురువారం జరిగింది. భార్యాభర్తల మధ్య గొడవ సరిచేయాలని ప్రయత్నించిన పోలీసులకు చెంప దెబ్బ తప్పలేదు. వివరాలు.. గిండి స్టేషన్‌ కానిస్టేబుల్‌ శశికుమార్, జోసఫ్‌ గురువారం వేకువజామున 1.30 గంటల సమయంలో గస్తీ పనుల్లో నిమగ్నమయ్యారు. ఆ సమయంలో గిండి పడువాంకరై, మసూది కాలనీ 17వ వీధికి వెళ్లారు. అక్కడ భార్య, భర్త గొడవపడుతూ ఉన్నారు. తన భర్త మద్యం సేవించి వచ్చి తనను వేధిస్తున్నట్లు భార్య తెలిపింది. అప్పుడు శశికుమార్‌ ఆమె భర్త వద్ద విచారించడానికి వెళ్లాడు. తీవ్ర మద్యం మత్తులో ఉన్న ఆ వ్యక్తి నా భార్య నా ఇష్టం అంటూ.. కానిస్టేబుల్‌ శశికుమార్‌ చెంప పగులగొట్టాడు. అతని పేరు ఉమర్‌ అని తెలిసింది. దీంతో అతడిని స్టేషన్‌కు తీసుకెళ్లారు. మత్తులో ఉండడంతో ఉమర్‌ను గురువారం విచారణ చేపట్టారు. పోలీసుపై చేయి చేసుకున్న సంఘటన ఆ ప్రాంతంలో కలకలం రేపింది.

మరిన్ని వార్తలు