అనుమానంతోనే హత్య

29 Jul, 2019 08:44 IST|Sakshi
వివరాలు వెల్లడిస్తున్న ఏసీసీ శివకుమార్‌ నిందితుడు విజయ్‌

భార్య హత్య కేసులో నిందితుడి అరెస్ట్‌

నంద్యాలలో పట్టివేత

జవహర్‌నగర్‌: అనుమానంతో భార్యను కత్తెరతో  పొడిచి చంపిన కేసులో నిందితుడిని అరెస్ట్‌ చేసినట్లు కుషాయిగూడ ఏసీపీ శివకుమార్‌ తెలిపారు. ఆదివారం జవహర్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌లో వివరాలు వెల్లడించారు. కర్నూలు జిల్లా, నంద్యాలకు చెందిన విజయ్‌కి 13 ఏళ్ల క్రితం నెల్లూరు జిల్లా, వింజమూరుకు చెందిన శాంతితో వివాహం జరిగింది. వీరికి ముగ్గురు సంతానం. పాతచీరలు, సామాన్ల వ్యాపారం చేసే విజయ్‌ వ్యాపారం నిమిత్తం పలు రాష్ట్రాలకు వెళ్లి చాలా రోజులు అక్కడే ఉండేవాడు. అప్పుడప్పుడు భార్యకు ఫోన్‌ చేస్తే ఫోన్‌ ఎప్పుడూ బిజీగా ఉండడంతో ఆమెపై అనుమానం పెంచుకున్నాడు. గతంలోనూ శాంతి ఇతరులతో ఫోన్లో మాట్లాడుతోందని పెద్దలకు ఫిర్యాదు చేయగా, వారు సర్ధిచెప్పడంతో గొడవ సర్దుమనిగింది. రెండు నెలల క్రితం   వ్యాపారానికి వెళుతున్న అతను భార్య, కుమారుడిని కూడా తీసుకెళ్లి తిరిగి వచ్చాడు. భార్యతో మంచిగానే ఉంటున్నా ఆమెపై అనుమానం మాత్రం పోలేదు. గత బుధవారం రాత్రి పథకం ప్రకారం నిద్రపోతున్న శాంతి గొంతులో కత్తెరతో పొడిచి హత్య చేశాడు. అనంతరం కుమారుడి తీసుకుని నంద్యాలకు పారిపోయాడు. గాలింపు చేపట్టిన పోలీసులు నంద్యాలలో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. సమావేశంలో డిటెక్టివ్‌ ఇన్‌స్పెక్టర్‌ నవీన్, ఎస్‌ఐలు హయూమ్, ఉదయబాస్కర్, అనిల్, విజయ్‌ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు