భర్త చేతిలో భార్య దారుణ హత్య

16 May, 2020 11:55 IST|Sakshi
వివరాలు తెలుసుకుంటున్న డీఎస్పీ

తానూరు (ముథోల్‌): మండలంలోని బెంబర గ్రామంలో భార్యపై అనుమానం పెంచుకున్న భర్త భార్యను హత్య చేసిన సంఘటన విషాదాన్ని నింపింది. ఎస్సై రాజన్న తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. బెంబర గ్రామానికి చెందిన షేక్‌ గౌష్యాబీ(40) అనే మహిళపై అనుమానం పెంచుకున్న భర్త షేక్‌ బాబుమియా శుక్రవారం మధ్యాహ్నం ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో రోకలితో తలపై మోది హత్య చేశాడు. భార్య షేక్‌ గౌష్యాబీపై భర్త బాబుమియా గత కొన్ని రోజులుగా అనుమానం పెంచుకున్నాడు. దీంతో తరచుగా ఇంట్లో గొడవలు జరగుతున్నాయి. మృతురాలు శుక్రవారం ఉదయం గ్రామంలో జరుగుతున్న ఉపాధిహామీ పనులకు వెళ్లి ఇంటికి వచ్చింది. మధ్యాహ్నం ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో భర్త ఇంటి తలుపులు పెట్టి రోకలితో తలపై మోదడంతో గౌష్యాబీ అక్కడిక్కడే మృతిచెందింది. దీంతో గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి .

సంఘటన స్థలాన్ని పరిశీలించిన డీఎస్పీ  
బెంబర గ్రామంలో జరిగిన హత్య సంఘటన స్థలాన్ని శుక్రవారం భైంసా డీఎస్పీ నిర్సంగరావు పరిశీలించారు. హత్యకు గల కారణాలను కుటుంబ సభ్యులతో అడిగి తెలుసుకున్నారు.బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు. ముథోల్‌ సీఐ అజయ్‌బాబు, ఎస్సై రాజన్న తదితరులు ఉన్నారు. మృతురాలికి ఇద్దరు కుమారులు ఒక కుమార్తె ఉంది.  

మరిన్ని వార్తలు