భార్యను హత్య చేసిన భర్త

23 May, 2020 08:50 IST|Sakshi

ఆత్మహత్యగా  చిత్రీకరించేందుకు యత్నం

కుషాయిగూడ: భార్యాభర్తల మధ్య జరిగిన గొడవ కాస్తా హత్యకు దారితీసింది. హత్యను ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేసి చివరకు పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు భర్త. కుషాయిగూడ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఈ దారుణం వెలుగు చూసింది.  శుక్రవారం ఎస్‌ఐ శ్రీనివాస్‌ తెలిపిన వివరాల ప్రకారం.. అస్సాం, తేజ్‌పూర్‌కు చెందిన సంతోష్‌ చౌహాన్‌ (35), దీపాలి (26)  దంపతులు జీవనోపాధి కోసం మూడేళ్ల క్రితం నగరానికి వచ్చారు. చర్లపల్లిలోని ఓ కంపెనీలో పని చేస్తూ వెంకట్‌రెడ్డినగర్‌లో నివాసముంటున్నారు.

సంతోష్‌చౌహాన్‌ గురువారం కంపెనీలో  పని ముగించుకొని రాత్రి 8 గంటలకు ఇంటికి వచ్చాడు. ఆ సమయంలో జీతం విషయంలో భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. పిల్లలు ఇంట్లో ఉండగానే భార్య దీపాలిని గదిలోకి తీసుకెళ్లి పట్కార్‌తో కొట్టి, గొంతు నులిమి చంపేశాడు. ఆ తర్వాత ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు భార్య మెడకు చున్నీకట్టి సీలింగ్‌ ఫ్యాన్‌కు వేలాడదీశాడు.  తాను మందలించడంతో ఆత్మహత్య చేసుకుందని స్థానికులను, పోలీసులను నమ్మించాడు. అయితే...పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి విచారించగా  అసలు విషయం బయటపడింది. నిందితుడిని కస్టడీలోకి తీసుకొని విచారిస్తున్నారు.

మరిన్ని వార్తలు