తనవెంట ఇంటికి రాలేదని భార్యపై భర్త దాడి

7 Mar, 2019 10:51 IST|Sakshi
గాయాలతో రూబీనా నిందితుడు రియాజ్‌

గోల్కొండ: తనవెంట ఇంటికి రావడంలేదని భార్యతో గొడవపడిన భర్త ఆమెపై కత్తితో దాడిచేసి తీవ్రంగా గాయపరిచాడు. ఈ సంఘటన బుధవారం గోల్కొండ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. గోల్కొండకు చెందిన రూబీనా, రియాజ్‌ భార్యాభర్తలు. కాగా పెళ్‌లైన తర్వాత రియాజ్‌ జులాయిగా తిరుగుతూ చెడు అలవాట్లకు బానిసయ్యాడు. ఈ విషయంపై తరచూ భార్యాభర్తల మధ్య గొడవ జరిగేది. భర్త ప్రవర్తనకు విసిగిపోయిన రూబీనా వారం రోజుల క్రితం గోల్కొండలోని పుట్టింటికి వెళ్లిపోయింది.

బుధవారం మధ్యాహ్నం అత్తింటికి వచ్చిన రియాజ్‌.. భార్యను తనతో ఇంటికి రమ్మని చెప్పగా ఆమె నిరాకరించింది. కోపోద్రిక్తుడైన రియాజ్‌ తనవెంట తెచ్చుకున్న కత్తితో ఆమెపై దాడి చేసి పరారయ్యాడు రూబీనా మెడ, చెవి భాగంలో తీవ్ర గాయాలయ్యాయి. విషయం పోలీసుకు చేరవేయడంతో వారు అక్కడికి చేరుకుని బాధితురాలిని చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

మరిన్ని వార్తలు