రెండో బిడ్డ పుడితే ప్రాణాలకు ప్రమాదమని..

27 May, 2020 07:53 IST|Sakshi

భార్య కడుపుపై తన్ని గర్భస్రావం చేసిన భర్త

జోతిష్యుడు చెప్పాడని దారుణానికి పాల్పడిన వైనం

చెన్నై,అన్నానగర్‌: రెండో బిడ్డ పుడితే తన ప్రాణానికి ప్రమాదమని జోత్యుష్యుడు చెప్పడంతో ఓ వ్యక్తి దారుణానికి ఒడిగట్టాడు. నిండు గర్భిణి అయిన భార్య కడుపుమీద కాలితో తన్ని గర్భస్రావం చేశాడు. వివరాలు..  ఈరోడ్‌ జిల్లా అమ్మపేట సమీపం ములియనూరికి చెందిన మునుస్వామి (32) భవన నిర్మాణ కార్మికుడు. ఇతని భార్య రమ్య (25). వీరికి ఆరేళ్ల క్రితం వివాహం జరిగింది. నాలుగేళ్ల ఒక కుమారుడు ఉన్నాడు. ఈ స్థితిలో రమ్య గర్భం దాల్చింది. అనంతరం మునుస్వామి జ్యోతిష్యుని చూడడానికి వెళ్లినప్పుడు, రెండవ బిడ్డ పుడితే తన ప్రాణాలకు ప్రమాదం అని జ్యోతిష్యుడు పలికాడు. దీంతో ఆందోళనకు గురైన మునిస్వామి భార్య రమ్యను అబార్షన్‌ చేసుకోమని కోరాడు.

అందుకు ఆమె అంగీకరించకపోవడంతో ఇరువురి మధ్య వాగ్వాదం జరిగింది. గత 18 వ తేదీ మద్యంలో ఇంటికి వచ్చిన మునిస్వామి మరోసారి భార్యను కొట్టాడు. అంతటితో ఆగకుండా రమ్య కడుపుపై తన్నాడు. నొప్పితో అల్లాడిన రమ్యని స్థానికులు రక్షించి ఆమెను తల్లి ఇంటికి పంపించారు. ఈ స్థితిలో సోమవారం రమ్యకు తీవ్రమైన కడుపు నొప్పి రావడంతో ఆస్పత్రికి తరలించారు. అక్కడ నుంచి మెరుగైన చికిత్స కోసం ఈరోడ్‌ ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్చారు. అక్కడ పరిశీలన చేసిన డాక్టర్లు రమ్యకి అబార్షన్‌ అయినట్లు తెలిసింది. దీంతో రమ్య అమ్మాపేట పోలీస్‌ స్టేషన్‌లో భర్తపై ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మునిస్వామి కోసం గాలిస్తున్నారు. 

మరిన్ని వార్తలు