మాంత్రికుడు చెప్పినట్లు వినలేదని భార్యను..

8 Mar, 2019 17:35 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

జైపూర్‌ : మాంత్రికుడు చెప్పినట్లు చెయ్యలేదన్న కోపంతో ఊరి ప్రజలందరూ చూస్తుండగా భార్యను విచక్షణా రహితంగా చితకబాదాడో భర్త. ఈ సంఘటన రాజస్తాన్‌లోని బార్మర్‌ జిల్లాలో ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. బార్మర్‌ జిల్లాలోని మందాపుర గ్రామానికి చెందిన ఓ మహిళ కొన్నిరోజులుగా కడుపునొప్పి వస్తోందని మంగళవారం భర్తకు చెప్పింది. దీంతో అతడు ఆమెను ఆసుపత్రికి తీసుకుపోకుండా మాంత్రికుడి వద్దకు తీసుకెళ్లాడు. ఆమెకు దెయ్యం పట్టిందని, దీని కోసం కొన్ని పూజలు చేస్తే సరిపోతుందని మాంత్రికుడు చెప్పాడు. పూజలో భాగంగా ఆమెను ఊరి చుట్టూ తిప్పి ఓ చోట ప్రజల ముందు ఉంచాడు.

అప్పుడు ‘నీ ఒంట్లో దెయ్యం ఉంది.. చెప్పినట్లు చెయ్‌!’ అని ఆ మాంత్రికుడు ఆమెకు సూచించాడు. అయితే ఇందుకు ఆమె అంగీకరించలేదు. దీంతో ఆ మహిళ భర్త అందరి ముందు ఆమెను బెల్టుతో చితకబాదాడు. కొట్టవద్దని ఆ మహిళ భర్తను ఎంత బ్రతిమాలినా అతడు వదల్లేదు. ఆమె అలసిపోయినా వదలకుండా చెప్పుతో విచక్షణా రహితంగా కొట్టాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలను అక్కడున్న కొందరు వీడియో తీశారు. అయితే భర్త తనపై చేయి చేసుకోలేదని, గుడికి రానందుకు తిట్టాడని సదరు మహిళ చెప్పటం గమనార్హం. దీనిపై ఎవ్వరూ పోలీసులకు ఫిర్యాదు చేయకపోవటంతో ఎలాంటి కేసు నమోదు కాలేదు. 

మరిన్ని వార్తలు