పెళ్లయిన రోజే భార్యను హత్య చేసి భర్త ఆత్మహత్య

12 Jun, 2020 06:50 IST|Sakshi
నిధి వాసన్‌, సంధ్య పెళ్లి ఫోటో (ఫైల్‌)

పెళ్లయిన రోజే దారుణం 

భార్యను హత్య చేసి భర్త ఆత్మహత్య  

తిరువళ్లూరు సమీపంలో విషాదం

కలిసిన మనసులతో.. కలకాలం సుఖసంతోషాల్లో తోడు ఉంటానని ప్రమాణం చేశాడు. భార్య బానిస కాదని, ఆజన్మాంతం ప్రేమిస్తానని నమ్మించాడు. ఓ శుభముహూర్తంలో ఆమె మెడలో తాళి కట్టాడు. ఏడడుగులు వేయించాడు. ఇక జీవితం సుఖమయం అవుతుందని ఊహించిన యువతికి తొలిరేయే.. మృత్యు రాత్రిగా మారింది. మొగుడి రూపంలో మృత్యువు ఆమె నూరేళ్ల జీవితాన్ని చీకట్లో బలితీసుకుంది. తొలిరాత్రి రోజే భార్యను హతమార్చిన ఆ మానవ మృగం ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. 

తిరువళ్లూరు(తమిళనాడు): పెళ్లి చేసుకున్న గంటల్లోనే భార్యను దారుణంగా హత్య చేసి తానూ ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన తిరువళ్లూరు జిల్లా పొన్నేరి సమీపంలో కలకలం రేపింది. తిరువళ్లూరు జిల్లా పొన్నేరి సమీపంలో సోమంజేరి గ్రామానికి చెందిన క్రేన్‌ ఆపరేటర్‌ నిధివాసన్‌ (27). ఇతనికి సమీప బంధువు సడయన్‌కుప్పం గ్రామానికి చెందిన సంధ్య(22)తో జనవరిలో వివాహం నిశ్చమైంది. జూన్‌ 10న వివాహం వైభవంగా నిర్వహించాలని అనుకున్నా.. లాక్‌డౌన్‌ నేపథ్యంలో కొద్ది మంది బంధువుల సమక్షంలో  అదే రోజు సమీపంలోని ఆలయంలో వివాహం జరిగింది. వివాహ సమయంలో బంగారు నగలు ద్విచక్ర వాహనం, ఇతర సామగ్రి అంటూ భారీగానే కట్నకానుకలు ఇచ్చారు.  

అర్ధరాత్రి కేకలు వేస్తూ.. 
బుధవారం వివాహం పూర్తయిన తరువాత తొలిరాత్రికి ఏర్పాట్లు చేశారు. అర్ధరాత్రి రాత్రి 12 గంటల సమయంలో యువతి గట్టిగా కేకలు వేసినట్టు తెలుస్తోంది. అయితే ఈ విషయాన్ని బంధువులు పట్టించుకోలేదు. గురువారం ఉదయం మూడు గంటలకు యువకుడు నీధివాసన్‌ తలుపులు తెరుచుకుని, గట్టిగా కేకలు వేస్తూ పరుగులు పెట్టడంతో బంధువులు దిగ్భ్రాంతి చెందారు. అనుమానంతో గదిలోకి వెళ్లి చూడగా యువతి రక్తపు మడుగులో పడి ఉంది. దీంతో కాట్టూరు పోలీసులకు సమాచారం అందించారు.

సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు యువతిని పరిశీలించగా, గడ్డపారతో పొడిచి దారుణంగా హత్య చేసినట్లు నిర్ధారించారు. మృతురాలి బంధువుల ఫిర్యాదు మేరకు మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న నిధివాసన్‌ కోసం గాలింపు చేపట్టారు. ఈ నేపథ్యంలో గ్రామ సమీపంలోని వేపచెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్టు సమాచారం అందుకున్న పోలీసులు యువకుడి మృతదేహాన్ని పోస్టుమారా్టనికి తరలించారు. వివాహమై 24 గంటలూ గడవక ముందే యువతి దారుణ హత్యకు గురి కావడం, యువకుడు సైతం ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకోవడం గ్రామంలో విషాదం నింపింది. చదవండి: అతడు.. ఆమె.. ఓ అన్న! 

గంజాయి మత్తే కారణమా? 
నిధివాసన్‌ గంజాయి, మద్యం అలవాట్లు ఉన్నట్టు పోలీసులు ప్రాథమిక విచారణలో నిర్ధారించారు. వివాహం నిశ్చయానికి ముందే మద్యానికి బానిసైన నీధివాసన్, మానసికరోగిగా మారిపోయాడని, సాధారణ స్థితికి రావడానికి మూడు నెలల పాటు మానసిక వైద్యశాలలో చిక్సిత కూడా తీసుకున్నట్టు పోలీసులు గుర్తించారు. నిధివాసన్‌ మానసిక పరిస్థితి సరిగ్గా లేకపోవడంతో పెళ్లి దాదాపు రద్దయ్యే పరిస్థితి ఏర్పడిందని, అయితే యువతిని బాగా చూసుకుంటామని, మద్యం వైపు వెళ్లడని యువకుడి తల్లిదండ్రులు ఇచ్చిన భరోసాతోనే వివాహం జరిగినట్టు పోలీసుల విచారణలో తేలింది. యువతిని హత్య చేసే సమయంలో మద్యం, గంజాయి మత్తులో ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు