మేమిలాగే ఉంటాం.. చస్తే చావు..

20 Dec, 2018 09:09 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

ఆత్మహత్యకు యత్నించిన వ్యక్తి మృతి

భార్య పద్ధతి నచ్చక తనువు చాలించిన భర్త

సాక్షి, కరీంనగర్‌ క్రైం:  కొత్తపల్లిలోని ఇందిరమ్మ కాలనీలో నివసించే బానోతు శ్రీనివాస్‌ అవమానభారంతో ఈనెల 14న పురుగుల మందు తాగి ఆత్మహత్యయత్నం చేసుకోగా బుధవారం మృతి చెందాడు. వివరాలు ఇలా ఉన్నాయి. వరంగల్‌ అర్బన్‌ జిల్లా వేలేరు మండలం పీచర గ్రామానికి చెందిన బానోతు శ్రీనివాస్‌(35) అనే వ్యక్తి 9 ఏళ్ల క్రితం సునిత అనే మహిళతో వివాహం జరిగింది. వీరికి ఒక కుమారుడు ఉన్నాడు. 5 ఏళ్ల క్రితం జీవనోపాధి కోసం కరీంనగర్‌కు వచ్చి కొత్తపల్లిలోని ఇందిరమ్మ కాలనీలో నివాసం ఉంటున్నాడు. శ్రీనివాస్‌ ప్రస్తుతం కరీంనగర్‌ మున్సిపాలిటిలో కాంట్రాక్ట్‌ లేబర్‌గా పని చేస్తున్నాడు. అయితే శ్రీనివాస్‌ భార్య సునిత బాషా అనే వ్యక్తితో చనువుగా ఉండడం గమనించిన శ్రీనివాస్‌ పద్దతి మార్చుకోమని పలుమార్లు హెచ్చరించాడు. దీంతో కుటుంబంలో గొడవలు మొదలయ్యాయి. 

ఈనెల 14న చనువుగా ఉన్న బాషా, సునీతను శ్రీనివాస్‌ పట్టుకున్నాడు. దీంతో వారిద్దరు శ్రీనివాస్‌పై దాడి చేసి ‘మేము ఇలాగే ఉంటాం నువ్వు సర్దుకుని ఉంటే ఉండు లేకుంటే చచ్చిపో’ అని చెప్పడంతో తీవ్ర మనస్తాపానికి గురైన శ్రీనివాస్‌ అక్కడి నుంచి వెళ్లి రేకుర్తి వద్ద పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. గమనించిన స్థానికులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శ్రీనివాస్‌ బుధవారం మృతి చెందాడు. మృతుడి బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని కొత్తపల్లి ఎస్‌ఐ స్వరూప్‌రాజ్‌ తెలిపారు. 

మరిన్ని వార్తలు