ప్రియుడితో భార్య పెళ్లి, భర్త ఆత్మహత్య.. వీడియో వైరల్‌

16 Mar, 2018 12:26 IST|Sakshi

మంచిర్యాల :  కట్టుకున్న భర్తను కాదని మరో యువకుడిని పెళ్లి చేసుకుంది ఓ యువతి. అంతేకాకుండా ప్రియుడితో కలిసి పెళ్లి దృశ్యాలను ఏకంగా భర్త మొబైల్‌కే వాట్సాప్‌లో పంపించి మానసికంగా వేధించింది. తీవ్రమనస్తాపానికి లోనైన భర్త.. పురుగుల మందు తాగి, ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ప్రియుడితో కలిసి భర్తకు పంపిన వీడియోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి. అయ్యో మరీ ఇంత దారుణమా.. తాళి కట్టిన పాపానికి ఇంతలా వేధిస్తారా అంటూ నెటిజన్లు నిప్పులు చెరుగుతున్నారు. ఇష్టం లేకపోతే పెళ్లి చేసుకోకు, కష్టం అయితే విడాకులు ఇవ్వు అంతే కానీ, భర్తని ప్రియుడితో కలిసి ఇలా కూడా వేధిస్తారా అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు.

వివరాలు.. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం శ్రీరాములపల్లి గ్రామానికి చెందిన నక్క ధర్మరాజు(27)కు గతేడాది మార్చిలో జగిత్యాల జిల్లా కన్నాపూర్‌ గ్రామానికి చెందిన నాగలక్ష్మితో వివాహం జరిగింది. నాగలక్ష్మికి వెల్గటూర్‌కు చెందిన మంత్రి మహేష్‌తో పెళ్లికి ముందు నుంచే సంబంధం ఉంది. పెళ్లి తర్వాత కూడా అతనితో సంబంధాన్ని కొనసాగించింది. తన ప్రియుడు మహేష్‌కు తరచూ ఫోన్‌ చేస్తూనే ఇంట్లో భర్తను తీవ్ర వేధింపులకు గురి చేయడం ప్రారంభించింది.

ఈ క్రమంలో నాగలక్ష్మితో కలిసి ఉన్న అసభ్యకరమైన వీడియోలు, ఫోటోలను మహేష్‌.. ఇటీవల ధర్మరాజు ఫోన్‌కు వాట్సాప్‌లో పంపించాడు. మరోవైపు ఈ నెల 4న పుట్టింటికి వెళ్లిన నాగ లక్ష్మి భర్త కట్టిన తాళిని తీసేసి ప్రియుడు మహేష్‌తో తాళి కట్టించుకుంది. ఈ వీడియోను కూడా ధర్మరాజుకు పంపించారు. వీటిని ధర్మరాజు బంధువులు కూడా చూశారు. వెంటనే వారు మహేష్‌కు ఫోన్‌ చేసి ప్రశ్నిస్తే.. తాను, నాగ లక్ష్మి పెళ్లి చేసుకున్నామని, ధర్మరాజు చనిపోయినా తమకు అభ్యంతరం లేదని సమాధానం ఇచ్చాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన ధర్మరాజు ఈ నెల 9న తన వ్యవసాయ పొలం వద్ద  పురుగుల మందుతాగగా, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం సాయంత్రం మృతిచెందాడు. మృతుడి సోదరుడు నక్క సత్తయ్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దీనికి బాధ్యులైన భార్య నాగలక్ష్మి, ఆమె ప్రియుడి మంత్రి మహేష్‌పై కేసు నమోదు చేశారు. ఈ వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవ్వడంతో, అయ్యే ఇంత దారుణమా.. తాళి కట్టిన పాపానికి ఇంతలా వేధిస్తారా, ప్రియుడితో కలిసి భర్తను ఇలా వంచిస్తారా అని నెటిజన్లు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.

మరిన్ని వార్తలు