రెండో పెళ్లి చేసుకున్న భార్యపై కేసు

18 Nov, 2019 06:41 IST|Sakshi
అశోక్, జ్యోతీశ్వరి(ఫైల్‌)

బంజారాహిల్స్‌: పరస్పర అంగీకారంతో విడాకుల కేసు కోర్టులో నడుస్తుండగానే తన భార్య మరో వ్యక్తిని చట్టవిరుద్ధంగా పెళ్లి చేసుకుందని, ఆమెపై చర్యలు తీసుకోవాలంటూ ఓ వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్‌ పోలీసులు వివాహితపై కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. శ్రీకృష్ణానగర్‌కు చెందిన అశోక్‌ 1999 మే 9న జ్యోతీశ్వరిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వారికి ఇద్దరు సంతానం. 2016 వరకు వీరి కాపురం సజావుగానే సాగింది.

అయితే ఖమ్మం జిల్లాకు చెందిన వేణుగోపాలరావు అనే వ్యక్తితో జ్యోతీశ్వరికి పరిచయం ఏర్పడటంతో వారి మధ్య గొడవలు వచ్చాయి. ఈ నేపథ్యంలో పరస్పర అంగీకారంతో విడాకుల కేసు దాఖలు చేశారు. ఈ కేసు కోర్టులో నడుస్తుండగానే జ్యోతీశ్వరి 2017లో వేణుగోపాల్‌ను వివాహం చేసుకున్నదని ఆరోపిస్తూ ఆమె భర్త అశోక్‌ పోలీసులకు  ఫిర్యాదు చేశాడు. వారిద్దరూ భార్యాభర్తలుగా చెప్పుకుంటూ బ్యాంకులో ఇంటి రుణం కూడా తీసుకున్నట్లు తెలిపాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు జ్యోతీశ్వరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు