భార్య కళ్లెదుటే భర్త అనంత లోకాలకు..

27 Mar, 2019 12:23 IST|Sakshi
భరత్‌ మృతదేహం

సాక్షి, టెక్కలి రూరల్‌: జీవితాంతం తోడుగా ఉంటానని అగ్ని సాక్షిగా పెళ్లి చేసుకున్న భర్త కళ్ల ఎదుటే మృతి చెందటంతో భార్య ఆవేదన వర్ణనాతీతం. భర్తతో కలిసి తన పుట్టింటికి వచ్చి తల్లిదండ్రులతో ఆనందంగా గడిపారు. తిరిగి అత్తవారింటికి వెళ్తుండగా మృత్యువు ట్రైన్‌ రూపంలో భర్తను తీసుకుపోయింది. పెళ్లై మూడు నెలలు గడవక ముందే ఇంతటి కష్టం రావడంతో ఆమె గుండెలు అవిసేలా రోధించింది. స్థానికుల తెలిపిన వివరాల ప్రకారం..టెక్కలిలోని పాలకేంద్రం వెనుక నివాసం ఉంటున్న లావణ్యకు మూడు నెలలు క్రితం చిత్తూరుకు చెందిన కావడి భరత్‌తో(29) వివాహం జరిగింది.

వివాహం జరిగిన తర్వాత లావణ్య కన్నవారి ఇంటికి భర్తతో కలిసి 5 రోజులు క్రితం వచ్చారు. అనంతరం తిరిగి మంగళవారం తన అత్తవారి ఊరు అయిన  చిత్తూరు వెళ్లేందుకు పయానమయ్యారు. నౌపడ ఆర్‌ఎస్‌ రైల్వేస్టేషన్‌కు వెళ్లి విశాఖ ఎక్స్‌ప్రెస్‌కు సికింద్రాబాద్‌ వరకు టిక్కెట్‌ తీశారు. లావణ్య ట్రైన్‌ ఎక్కిన తర్వాత భరత్‌ ట్రైన్‌ ఎక్కే సమయంలో ట్రైన్‌ ముందుకు కదిలింది. భార్య కళ్లెదుటే భర్త ట్రైన్‌ కిందకు వెళ్లిపోవడంతో రెండు కాళ్ల పైనుంచి ట్రైన్‌ వెళ్లింది. తీవ్రగాయాలు కావడంతో హుటాహుటిన టెక్కలి జిల్లా ఆస్పత్రికి తరలించారు. వైద్యులు ప్రథమ చికిత్స నిర్వహించి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యంకోసం శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు టెక్కలి పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు