కుషాయిగూడ: కాళ్ల పారాణి ఆరకముందే వేధింపుల పర్వం మొదలుపెట్టాడు..పెళ్లికొచ్చిన చుట్టాలు వెళ్లడమే ఆలస్యం తన నిజస్వరూపాన్ని ప్రదర్శించాడో భర్త.. నీ పళ్లు ఎత్తుగా ఉన్నాయి.. బక్కగా ఉన్నావు.. నీవు నాకు ఇష్టం లేదంటూ (తలాక్) విడాకులిచ్చాడు. తనకు జరిగిన అన్యాయం మరో యువతికి జరగవద్దంటూ బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కుషాయిగూడ పోలీసులు ఆమె భర్తపై వేధింపుల కేసు నమోదు చేసిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితురాలు, పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి..
హెచ్బీకాలనీ, ఇందిరానగర్ కాలనీకి చెందిన మహ్మద్ దస్తగిరి షామీమ్ దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ముగ్గురు కుమారులు. చిన్న కుమార్తె రుక్సానాబేగంను రాజేందర్నగర్, ఆసద్నగర్లో నివసించే మహ్మద్ ముస్తాఫాతో గత జూన్–27న వివాహం జరిపించారు. పెళ్లి సమయంలో రూ.5లక్షలు కట్నంగా ఇచ్చారు. పెళ్లయిన తర్వాత వారం రోజులు వారు సంతోషంగానే ఉన్నారు. పెళ్లికి వచ్చిన చుట్టాలు కాస్తా గడప దాటడమే ఆలస్యం భర్త ముస్తాఫా నీ పళ్లు ఎత్తుగా ఉన్నాయని, బక్కగా ఉన్నావు నాకు నువ్వంటే ఇష్టం లేదంటూ భార్యపై వేధింపుల పర్వానికి తెరలేపాడు. మీ కుటుంబ సభ్యులు, చుట్టాలంతా పెద్ద ఎత్తున బంగారం ధరించారు. అదనంగా కట్నం కావాలని..బంగారం ఇవ్వాలంటూ భర్తతో పాటు అత్త మామలు కూడా వేధింపులు మొదలుపెట్టారు. తండ్రి లేక పోవడంతో తల్లి, తోడబుట్టిన అన్నలు అప్పు చేసి పెళ్ళి చేశారు. వారికి ఈ విషయం ఏలా చెప్పాలో అర్థం కాక రుక్సానాకు దిక్కుతోచలేదు. వేధింపుల పర్వానికి తెరలేపిన మరుక్షణం నుంచే భార్య తరపున వారి ఫోన్ నెంబర్లన్నీ బ్లాక్ లిస్టులో పెట్టాడు. దీంతో రుక్సానా కుటుంబ సభ్యులు పలుమార్లు ఫోన్ మాట్లాండేదుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది.
ముస్తాఫా–రుక్సానా పెళ్లి ఫొటో..
నెల రోజులు గడిచినా ఫోన్ కలవకపోవడంతో జూలై–29న రుక్సానా కుటుంబ సభ్యులు నేరుగా ఆమె వెళ్లారు. జ్వరంతో మంచాన పడిన కూతురిని చూశారు. ఏం జరిగింందని ప్రశ్నించగా బోరున విలపిస్తూ జరిగిన విషయం చెప్పింది. దీంతో వారు రుక్సానాను ఆసుపత్రిలో చూపించి ఇంటికి తీసుకెళ్లారు. ఆ తర్వాత నెలరోజులు గడిచినా రుక్సానా అత్తింటి వారి నుంచి ఎలాంటి సమాచారం లేకపోవడంతో సెప్టెంబర్–26న మల్కాజిగిరి పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు భర్త ముస్తాఫాను పిలిపించి సర్ది చెప్పడంతో అక్టోబర్ –3 తన భార్యను ఇంటికి తీసుకెళ్తానని చెప్పి వెళ్లాడు. అయితే అంతకు ముందుగానే అక్టోబర్–1న ముస్తాఫా తన రుక్సానా ఇంటికి వచ్చి అందరి ఎదుటే తలాక్.. తలాక్..తలాక్ అంటూ వెళ్లి పోయాడు. అనంతరం ఆమె కుటుంబసభ్యులు ఫోన్ చేసినా స్విచాఫ్ వస్తుంది. వారం రోజుల తరువాత ముస్తాఫా ఫోన్ చేసి నీవు ఏం చేసిన వృథానే.. నీవ్వు నాకు ఇష్టం లేదంటూ ఫోన్లో కూడా తలాక్ చెప్పినట్లు బాధితురాలు కన్నీటి పర్యంతమైంది. గత్యంతరం లేని పరిస్థితుల్లో రుక్సానా కుషాయిగూడ పోలీసులను ఆశ్రయించి అత్తింటి వేధింపులపై ఫిర్యాదు చేయడంతో 498(ఏ), సెక్షన్–3,4 ( ముస్లిం ఉమెన్ ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్ ఆన్ మ్యారేజ్) సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్ తెలిపారు.
అజ్ఞాతంలోకి ముస్తాఫా..
ముస్తాఫా– రుక్సానా ఘటనపై శుక్రవారం మీడియా లో పెద్ద ఎత్తున కథనాలు రావడంతో ముస్తాఫా అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్లు సమాచారం. కేసు నమోదు చేసి ముస్తాఫా కోసం ఆరా తీయగా అచూకి లభ్యం కాలేదని ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్ తెలిపారు. అదే పనిలో ఉన్నామని అతన్ని అదుపులోకి తీసుకొని కోర్టు ఎదుట హాజరుపరుస్తామని ఆయన పేర్కొన్నారు.
పోలీసులకు ఫిర్యాదు చేస్తున్న రుక్సానా, ఆమె తల్లి
మరెవరికి ఇలా జరగకూడదు– రుక్సానా ( బాధితురాలు)
మ్యారేజ్బ్యూరో ద్వారా మమ్మలను సంప్రందించారు. పెళ్లిచూపులు జరిగిన తరువాతే మా వివాహం నిశ్చమయింది. పెళ్లికి ముందే కట్నకానుకలు మాట్లాడుకొని సంతోషంగా నా పెళ్లి జరిపించారు. పెళ్లికి ముందు చార్మినార్ వద్ద ఓ బట్టలషాపును చూపించి అది తనదేనని నమ్మించాడు. వాస్తవానికి అతను ఆటో డ్రైవరు. మా కుటుంబ సభ్యులు ఎంతో కష్టపడి నా పెళ్లి చేశారని భావించి దాన్ని కూడ భరించాను. పెళ్లికి వచ్చిన చుట్టాలు వెళ్లడమే ఆలస్యం వేధింపులు మొదలుపెట్టాడు. మీ చుట్టాలంతా చాలా బంగారం ధరించారు. అదనంగా కట్నం కావాలి.. బంగారం కావాలంటూ వేధించేవాడు. నీ పళ్లు ఎత్తుగా ఉన్నాయి, బక్కగా ఉన్నావంటూ అవమానించడమేగాక నన్ను వదులుకోవాలని అత్తమామలతో కలిసి ఫ్లాన్ చేసి నాకు తలాక్ ఇచ్చాడు. ఏం చేయాలో తెలియని పరిస్థితి. పెళ్లికి చేసిన అప్పులు కూడా తీరకముందే నా కూతురు సంసారం ఇలా అయిందన్న బాధతో మా అమ్మ మంచాన పడింది. ఇలాంటి అన్యాయం మరో అమ్మాయికి జరగకూడదనే నేను పోలీసులను ఆశ్రయించాను. ఆడపిల్లల జీవితాలతో ఆడుకునే ఇలాంటి వ్యక్తిని కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని పోలీసులను వేడుకుంటున్నాను.