కుమార్తెతో సహా భవనం పైనుంచి దూకి తల్లి ఆత్మహత్యాయత్నం
కుమార్తె మృతి, తల్లికి తీవ్రగాయాలు
మల్లాపూర్: భర్త వేధింపులు తాళలేక ఓ మహిళ భవనంపై నుంచి దూకి ఆత్మహత్యకు యత్నించింది. ఈ ఘటనలో కుమార్తె అక్కడిక్కడే మృతి చెందగా తల్లికి తీవ్ర గాయాలైన సంఘటన మంగళవారం రాత్రి నాచారం పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ మహేష్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. చత్తీస్ఘడ్కు చెందిన యోగేష్, దామిని( 21) దంపతులు బతుకుదెరువు నిమిత్తం ఆరు నెలల క్రితం నగరానికి వలస వచ్చి మల్లాపూర్లో ఉంటున్నారు. కొద్ది రోజుల క్రితం నిర్మాణంలో ఉన్న భవనంలోకి మకాం మార్చారు. వీరికి ఒక కుమార్తె విద్య(1.5) ఉంది. యోగేష్ కంకర మిషన్ మేస్త్రీగా పని చేస్తుండగా, దామిని కూలీ పని చేసేది. గత కొంత కాలంగా యోగేష్ భార్యపై అనుమానం పెంచుకోవడంతో వారి మధ్య తరుచూ గొడవలు జరుగుతుండేవి.
మంగళవారం కూడా వారి మధ్య గొడవ జరగడంతో మనస్తాపానికి లోనైన దామిని తన కుమార్తె విద్యను తీసుకుని తాము ఉంటున్న మూడు అంతస్తుల భవనంపైకి ఎక్కి కిందకు దూకింది. ఈ ఘటనలో చిన్నారి విద్య అక్కడికక్కడే మృతి చెందగా, దామినికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న నాచారం పోలీసులు వివరాలు సేకరించారు. విద్య మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం, తల్లి దామినిని చికిత్స నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. దామిని కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న యోగేష్ కోసం నాలుగు బృందాలను ఏర్పాటు చేసి గాలిస్తున్నట్లు ఇన్స్పెక్టర్ మహేష్ తెలిపారు.