రెండో పెళ్లాం మోజులో పడి..

5 Sep, 2018 07:47 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

మొదటి భార్య దారుణ హత్య

హైదరాబాద్‌, మైలార్‌దేవ్‌పల్లి: రెండో పెళ్లాం మోజులో పడి ఓ వ్యక్తి ప్రేమించి పెళ్లిచేసుకున్న భార్యను రోకలిబండతో మోది దారుణంగా హత్య చేసిన సంఘటన మైలార్‌దేవ్‌పల్లి పోలీసు స్టేషన్‌ పరిధిలో మంగళవారం చోటుచేసుకుంది. ఇన్‌స్పెక్టర్‌ హన్మంతు కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. మహబూబ్‌నగర్‌ జిల్లా, హన్వడా గ్రామానికి చెందిన శిరీష,రమేష్‌ 12 ఏళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. బతుకుదెరువు నిమిత్తం నగరానికి వలసవచ్చిన వీరు కాటేదాన్‌ పారిశ్రామిక వాడలోని పద్మశాలీపురంలో ఉంటున్నారు.

వీరికి ఇద్దరు కుమారులు. కాగా రెండేళ్ల క్రితం రమేష్‌కు మహబూబ్‌నగర్‌ జిల్లా బండమీదిపల్లెకు చెందిన పద్మ పరిచయం ఏర్పడంతో ఆమెను రెండో పెళ్లి చేసుకున్నాడు. దీంతో శిరీష బంధువులు పంచాయతీ పెట్టి పద్మతో కాపురం వద్దని, ఆమెకురూ. 4 లక్షల నష్టపరిహారం ఇవ్వాలని తీర్మానం చేశారు. మంగళవారం డబ్బుల విషయమై శిరీష, రమేశ్‌ల మధ్య గొడవ జరిగింది. కోపోద్రిక్తుడైన రమేశ్‌ ఆమెపై రోకలిబండతో దాడి చేయడంతో శిరీష అక్కడికక్కడే మృతి చెందింది.కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుడు రమేశ్‌ కోసం గాలిస్తున్నారు. 

మరిన్ని వార్తలు