అనుమానంతో భార్యను హతమార్చిన భర్త

24 Feb, 2020 10:29 IST|Sakshi
స్వరూప మృతదేహం

 స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో లొంగిపోయిన నిందితుడు

సాక్షి, అశ్వారావుపేట(ఖమ్మం): ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అనుమానంతో హతమార్చాడు. ఈ సంఘటన అశ్వారావుపేట మండల కేంద్రంలో ఆదివారం చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. స్థానిక దొంతికుంటకు చెందిన పచ్చనీల మంగారావు, స్వరూప(25) పదేళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి ముగ్గురు ఆడ పిల్లలు. ఏడేళ్ల నందిని, ఐదేళ్ల మనోజ్ఞి, నాలుగేళ్ల హని ఉన్నారు. కాగా గడిచిన కొద్ది నెలలుగా మంగారావు భార్యను అనుమానించడంతో గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో దంపతుల మధ్య మనస్పర్థలు ఏర్పడ్డాయి. తరచూ కలహాలు చోటుచేసుకుంటున్నాయి. ఆదివారం మధ్యాహ్నం కూడా ఇంట్లోనే ఇద్దరి మధ్య వాగ్వాదం, ఘర్షణ జరిగింది. దీంతో కోప్రోదిక్తుడైన మంగారావు ఆమెను తలపై కొట్టాడు. గొంతు నులిమి హతమార్చాడు. అనంతరం నేరుగా స్థానిక పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. స్థానిక సీఐ ఎం. అబ్బయ్య, ఎస్‌ఐ మధుప్రసాద్‌ సంఘటన స్థలాన్ని సందర్శించారు. వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. 

ఆత్మహత్యాయత్నానికి పాల్పడి..
ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య మరో వ్యక్తితో వివాహేతర సంబంధం నెరుపుతోందనే అనుమానంతో.. వారం రోజుల క్రితం మంగారావు ఇంట్లో ఉన్న పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. గమనించిన కుటుంబీకులు అతని అశ్వారావుపేటలో ఓ ఆస్పత్రికి తరలించి వైద్యం చేయించారు. దీంతో ప్రాణాపాయం నుంచి బయట పడ్డాడు. ఆ అనుమానమే ఆదివారం కూడా గొడవకు దారితీసి హత్యకు పురికొల్పింది.

మరిన్ని వార్తలు