భార్య, కుమారుడి గొంతు నులిమేశాడు!

6 Jun, 2018 11:25 IST|Sakshi
ఉదయభాను, చిన్నారి వినోద్‌ మృతదేహాలు ,ఉదయభాను (ఫైల్‌) , వినోద్‌ (ఫైల్‌) , నిందితుడు ఆనంద్‌ (ఫైల్‌)

దారుణానికి ఒడిగట్టిన కసాయి!

కర్నూలు నగరంలో ఘటన

కర్నూలు (టౌన్‌): వేరే అమ్మాయి మోజులో పడి మూడు నెలల గర్భిణి అయిన భార్యను, మూడేళ్ల కుమారున్ని ఓ కసాయి గొంతునులిమి చంపేశాడు. ఈ ఘటన మంగళవారం కర్నూలు నగరంలో చోటుచేసుకుంది. మృతురాలి తండ్రి ఉసేనయ్య, కర్నూలు నాలుగో పట్టణ సీఐ రామయ్యనాయుడు తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. పాణ్యం మండలం బలపనూరు గ్రామానికి చెందిన ఉదయభానును కర్నూలులోని సంపత్‌నగర్‌కు చెందిన ఆనంద్‌కు ఇచ్చి నాలుగేళ్ల క్రితం వివాహం చేశారు. వీరికి మూడేళ్ల కుమారుడు వినోద్‌ ఉన్నాడు.

ప్రస్తుతం ఉదయభాను మూడు నెలల గర్భిణి. స్థానిక జ్యోతి మాల్‌లోపనిచేసే ఆనంద్‌.. మరో యువతితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఈ నేపథ్యంలో భార్యను, బిడ్డను అడ్డు తొలగించుకోవాలని పథకం పన్నాడు. మంగళవారం ఉదయం తన భార్య, కుమారుడు చనిపోయారంటూ బంధువులకు, పోలీసులకు ఫోన్‌ ద్వారా సమాచారం అందించాడు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని నిశితంగా పరిశీలించారు. మృతురాలి గొంతు మీద కందిపోయినట్లు ఉంది. దీంతో ఆనంద్‌పై అనుమానంతో అతన్ని స్టేషన్‌కు తరలించారు.

అతనే భార్యను, కుమారున్ని గొంతు నులిమి చంపేసినట్లు  ప్రాథమిక అంచనాకు వచ్చారు. పంచనామా ప్రకారం గొంతు నులిమి చంపినట్లు తెలుస్తోందని, అయితే పూర్తి స్థాయి విచారణ చేయాల్సి ఉందని నాలుగో పట్టణ సీఐ రామయ్యనాయుడు తెలిపారు. మృతురాలి తండ్రి ఉసేనయ్య ఫిర్యాదు మేరకు ఆనంద్‌పై కేసు నమోదు చేసినట్లు చెప్పారు. కాగా.. రెండు రోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లి విగత జీవులుగా మారిన కూతురు, మనవడిని చూసి ఉసేనయ్య కుటుంబ సభ్యులు బోరున విలపించారు.  

మరిన్ని వార్తలు