కంప్లి:అనుమానం అతన్ని దెయ్యంలా ఆవహించింది. పెళ్లి చేసుకున్నప్పుడు చేసిన బాసలను కాలదన్నాడు. గర్భిణి అని కూడా చూడకుండా భార్యను బండరాతితో దారుణంగా హతమార్చాడు. అనంతరం పోలీసులకు లొంగిపోయాడు. ఈఘటన రాంసాగర గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు రాంసాగర గ్రామానికి చెందిన రమేష్(23)కు మరిబిహాల్ గ్రామానికి చెందిన శశికళతో వివాహమైంది. వీరికి ఒక కుమార్తె ఉంది. అయితే రమేష్ ఇటీవల ర మరో యువతిని రెండో వివాహం చేసుకున్నాడు.
ఇద్దరు భార్యలతో కాపురం చేస్తున్నాడు. కొంతకాలంగా శశికళపై అనుమానం పెంచుకున్నాడు. ప్రస్తుతం ఆమె గర్భవతి. అయినప్పటికీ కనికరం లేకుండా ఆమెను అంతమొందించాలని పథకం రచించాడు. శనివారం రాత్రి రాంసాగ సమీపంలోని సొరంగం వద్దకు తీసుకెళ్లి అక్కడ ఆమెను బండరాతితో మోదాడు. చనిపోయిందని నిర్ధారించుకున్న తర్వాత మృతదేహాన్ని కాలువలో పడేసి అనంతరం పోలీసులకు లొంగిపోయాడు. బిత్తరపోయిన పోలీసులు అతన్ని వెంటనే అదుపులోకి తీసుకున్నారు. ఆదివారం నిందితుడే పోలీసులను వెంట పెట్టుకొని వెళ్లి ఘటనా స్థలాన్ని చూపించాడు. దీంతో పోలీసులు మృతదేహాన్ని వెలికి తీసి నిందితుడు రమేష్ను అరెస్ట్ చేసి కేసు దర్యాప్తు చేపట్టారు.