టీ.నగర్: తమిళనాడు, మదురై సమీపాన సంక్రాంతి కానుకగా రేషన్షాపులో అందజేసిన నగదు ఇవ్వలేదని ఆగ్రహించిన ఓ వ్యక్తి భార్యను హతమార్చాడు. శనివారం పోలీసులకు లొంగిపోయాడు. మదురై జిల్లా, ఉసిలంపట్టి సమీపంలోని ఏళుమలైలో రామర్ (70), అతని భార్య రాసమ్మాళ్ అలియాస్ రాసాత్తి (65)తో నివసిస్తున్నాడు. ఈమె కేరళలో కూలిపనులకు వెళ్లి నెలకు ఒకసారి ఇంటికి వస్తున్నట్లు సమాచారం. దీంతో ఏళుమలైలో విడిగా నివసిస్తున్న రామర్ అక్కడున్న స్థానికుల వద్ద అప్పులు చేశాడు. ఇదిలావుండగా శుక్రవారం ప్రభుత్వం అందజేసిన సంక్రాంతి నగదు కానుకను తీసుకునేందుకు ఏళుమలైకు వచ్చారు.
రేషన్షాపులో రూ. వెయ్యి నగదు తీసుకుని రాగా అందులో రూ.500 ఇవ్వాలని కోరాడు. ఈ నగదును ఇచ్చేందుకు రాసాత్తి నిరాకరించింది. దీంతో రాత్రంతా వారి మధ్య తగాదా జరిగింది. శనివారం తెల్లవారుజామున నాలుగు గంటల సమయంలో రాసాత్తి నిద్రిస్తుండగా రామర్ ఆమె గొంతుకోసి హతమార్చాడు. దీంతో ఆమె మృతిచెందింది. తర్వాత రామర్ ఏళుమలై పోలీసు స్టేషన్లో లొంగిపోయాడు. రాసాత్తి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉసిలంపట్టి ప్రభుత్వ ఆస్పత్రికి పంపారు.