భార్యను కడతేర్చిన భర్త

3 Jun, 2019 11:53 IST|Sakshi
తల్లిని కోల్పోయి రోదిస్తున్న పిల్లలు సరళమ్మ (ఫైల్‌)

వ్యసనాలకు లోనై తరచూ గొడవలు

పద్ధతి మార్చుకోవాలని సూచించడమే భార్య చేసిన తప్పు

అర్ధరాత్రి నిద్రలో ఉండగా కర్రతో బాది హత్య

ఆపై తనూ ఆత్మహత్యాయత్నం

తల్లికి దూరమైన ముగ్గురు పిల్లలు

చెడు వ్యసనాలు అతడిని అప్పులపాలు చేశాయి. తాకట్టు పెట్టిన తన నగలను తెచ్చివ్వాలని కోరిన ఇల్లాలిపై కోపోద్రిక్తుడై కాలయముడిగా మారాడు. నిద్రిస్తున్న భార్యను కర్రతో బాది హత్య చేశాడు. ఆపై తనూ ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ ఘటనతో యాటకల్లులో విషాదం అలుముకుంది.

అనంతపురం ,శెట్టూరు: కళ్యాణదుర్గం మండలం నారాయణపురం గ్రామానికి చెందిన గొల్ల సరళమ్మ(30)కు శెట్టూరు మండలం యాటకల్లుకు చెందిన గొల్ల రామచంద్రతో తొమ్మిదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు కుమారులు యోగానంద, గోవర్ధన్, కుమార్తె చైత్ర ఉన్నారు. చెడువ్యసనాలకు అలవాటుపడిన రామచంద్ర అందినకాడల్లా అప్పులు చేశాడు. ఈ క్రమంలో భార్య ఒంటిపై ఉన్న నగలు కూడా తాకట్టు పెట్టి నగదు తెచ్చుకుని జూదంలో కోల్పోయాడు. ఈ విషయమై భార్యాభర్తల మధ్య తరచూ గొడవ జరిగేది. శనివారం రాత్రి సరళమ్మ తన నగలు తనకు తెచ్చివ్వాలంటూ భర్తను నిలదీసింది. దీంతో ఇద్దరి మధ్య మాటామాటా పెరిగింది. దీంతో రామచంద్ర ఆవేశంతో ఊగిపోయాడు. అలా కాసేపటి తర్వాత అందరూ నిద్రకు ఉపక్రమించారు. అయితే తనను నిలదీసిందనే కోపంతో రగిలిపోతున్న రామచంద్రప్ప ఆదివారం తెల్లవారుజామున నిద్రలో ఉన్న భార్య సరళమ్మను కర్రతో తలపై మోదాడు. సమీపంలోనే నిద్రిస్తున్న రామచంద్ర తల్లి ఉలికిపడి లేచి చూసి గట్టిగా అరిచింది. చుట్టు పక్కల జనం వచ్చి సరళమ్మను అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలోనే ప్రాణాలు విడిచింది. 

సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

భార్య చనిపోయిందని తెలిసిఆత్మహత్యాయత్నం
భార్య చనిపోయిందని తెలుసుకున్న గొల్ల రామచంద్ర బహిర్భూమికని వెళ్తూ పురుగుమందు వెంట తీసుకెళ్లి.. అక్కడే తాగి పడిపోయాడు. అటుగా వెళ్తున్న గ్రామస్తులు అపస్మారక స్థితిలో పడి ఉన్న రామచంద్రను చూసి కళ్యాణదుర్గం ప్రభుత్వ ఆస్పత్రికి తీసుళ్లారు. ప్రథమ చికిత్స అనంతరం అక్కడి నుంచి అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. రామచంద్ర పరిస్థితి విషమంగా ఉన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. సీఐ శివప్రసాద్, ఎస్‌ఐ రమనారెడ్డి సంఘటనా స్థలాన్ని పరిశీలించి, హతురాలి తల్లి లక్ష్మిదేవమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేశారు. తల్లిని కోల్పోయిన ముగ్గురు పిల్లలు రోదించిన తీరు అందరినీ కలచివేసింది.  

మరిన్ని వార్తలు