భార్యను హతమార్చిన భర్త

3 Feb, 2020 12:40 IST|Sakshi
హత్యకు గురయిన భార్య రమాదేవి ఆత్మహత్య యత్నం చేసిన భర్త శ్రీను చిన్నారులు వెంకటేష్, లక్ష్మి

గొడ్డలితో మెడపై దాడి

పురుగు మందు తాగి తను కూడా ఆత్మహత్యాయత్నం

ప్రకాశం, పెద్దదోర్నాల: భార్యపై అనుమానం పెంచుకున్న ఓ భర్త ఆమెను నమ్మకంగా ఓ నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లి గొడ్డలి గొంతును తెగనరికాడు. దీంతో పాటు అతను కూడా పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ  దారుణ సంఘటన మండల పరిధిలోని బందంబావి గిరిజన గూడెం వద్ద ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. ఈ వార్త మండలంలో దావానలంగా వ్యాపించింది.  ఈ విషయాన్ని బంధువులు పోలీసుల దృష్టికి తీసుకురావటంతో సమాచారం అందుకున్న ఎస్సై అబ్దుల్‌ రహిమాన్‌ హుటాహుటిన సంఘటనా స్థలికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. మండల పరిధిలోని తిమ్మాపురానికి చెందిన మండ్లా శ్రీను, మండ్లా రమాదేవి (27) భార్యాభర్తలు.

వీరివురు మండల పరిధిలోని బందంబావి వద్ద ఓ పంట పొలానికి కాపలా కోసం గత కొన్నేళ్లుగా అక్కడే ఉంటున్నారు. ఈ క్రమంలో ఆదివారం నాడు భార్య రమాదేవిని కట్టెలకు వెళదామని సమీపంలోని తుప్పల వద్దకు శ్రీను తీసుకెళ్లాడు. అక్కడ ఆమెతో ఘర్షణ పడి గొడ్డలితో భార్య గొంతుపై నరికాడు. ఆ తర్వాత మండ్ల శ్రీను తాము నివాసం ఉండే గృహానికి సమీపంలో పురుగు మందు సేవించి ఆత్మహత్య యత్నం చేశాడు. సమాచారం అందుకున్న 108 సిబ్బంది పురుగు మందును తాగిన శ్రీనును మండల కేంద్రంలోని ఏరియా వైద్యశాలకు తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం మార్కాపురం వైద్యశాలకు తరలించారు. మృతురాలు రమాదేవికి 10 సంవత్సరాల వయసు కలిగిన కుమార్తె లక్ష్మి, 8 యేళ్ల వయస్సున్న కుమారుడు వెంకటేష్‌ ఉన్నారు. తల్లి హత్య గురయి, తండ్రి పురుగు మంది తాగి చావు బతుకుల మద్య కొట్టు మిట్లాతున్న విషయం తెలుసుకున్న ఆ చిన్నారులు దీనంగా చూసే చూపులు అందరి హృదయాలను కలిచి వేశాయి. పూర్తి వివరాలు దర్యాప్తులో తేలాల్సి ఉంది.

మరిన్ని వార్తలు