భార్యను చంపిన భర్త

14 Feb, 2019 13:58 IST|Sakshi
మృతి చెందిన సునీత (ఫైల్‌), నిందితుడు మధు

కర్నూలు,డోన్‌ రూరల్‌: కట్టుకున్న భార్యను రోకలి బండతో తల మీద మోది హత్యచేసిన భర్త ఉదంతం బుధవారం పట్టణంలోని కొత్తపేటలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. ప్యాపిలి మండలం జలదుర్గం గ్రామానికి చెందిన మధు అనంతపురం జిల్లా తాడిపత్రికి చెందిన సునీతను 15ఏళ్ల క్రితం వివాహం చేసుకున్నాడు. కొంతకాలంగా డోన్‌ పట్టణంలోని కొత్తపేటలో నివాసముంటున్నారు. మధు హైదరాబాద్‌లో కారు డ్రైవర్‌గా పనిచేస్తూ వారానికోసారి వచ్చి పోయేవాడు. అయితే ఇటీవల భార్యపై అనుమానం పెంచుకున్నాడు. ఈ క్రమంలో మూడు రోజుల క్రితం హైదరాబాద్‌ నుంచి వచ్చిన మధు బుధవారం తెల్లవారుజామున మంచంపై నిద్రిస్తున్న భార్యను రోకలిబండతో మోదాడు.

మృతిచెందిందని భావించి నేరుగా పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి విషయం పోలీసులకు చెప్పాడు. వారు హుటాహుటిన వచ్చి చూడగా రక్తపు మడుగులో కొనఊపిరితో ఉన్నట్లు గమనించి స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. డీఎస్పీ ఖాదర్‌బాషా, సీఐ.కళావెంకరమణ, ఎస్‌ఐ.సునీల్‌కుమార్‌ ఆస్పత్రికి చేరుకుని మహిళ పరిస్థితిని గమనించారు. అక్కడి వైద్యుల సలహా మేరకు కర్నూలు పెద్దాస్పత్రికి తరలించగా అక్కడ కోలుకోలేక మృతిచెందింది. మధును అదుపులోకి తీసుకొని, కేసు నమోదు చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. తల్లి మృతిచెందడం, తండ్రి పోలీసులు తీసుకెళ్లడంతో ఇద్దరు కుమారులు దిక్కుతోచని స్థితిలో ఉండిపోయారు.

మరిన్ని వార్తలు