కారు కొనడానికి డబ్బులు ఇ‍వ్వలేదని భార్యను..

15 Jul, 2018 19:25 IST|Sakshi
భర్త గురుప్రీత్‌ సింగ్‌తో మమన్‌దీప్‌ కౌర్‌ (ఫైల్‌)

చండీగఢ్‌ : కారు కొనటానికి డబ్బులు ఇ‍‍వ్వలేదన్న కోపంతో కట్టుకున్న భార్యను పెనంతో కొట్టి చంపాడు ఓ భర్త. ఈ సంఘటన పంజాబ్‌ రాష్ట్రంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. పంజాబ్‌లోని మొహలి జిల్లాకు చెందిన మమన్‌దీప్‌ కౌర్‌(28),  భర్త గురుప్రీత్‌ సింగ్‌తో కలిసి జిరక్‌పూర్‌లో నివాసముంటోంది. గురుప్రీత్‌ సింగ్‌ 10 సంవత్సరాలు లండన్‌లో ఉండి సంవత్సరం క్రితమే ఇండియాకు తిరిగి వచ్చాడు. ఆనాటి నుంచి ఉద్యోగానికి వెళ్లకుండా అదనపు కట్నం కావాలంటూ భార్యను వేధించేవాడు. గత కొద్దినెలలుగా కారు కొనటానికి డబ్బులు కావాలని మమన్‌దీప్‌ను ఇబ్బంది పెట్టేవాడు. క్యాబ్‌ సర్వీస్‌ మొదలుపెట్టడానికి ఇంటి నుంచి డబ్బులు తెమ్మంటూ హింసించే వాడు.

ఈ విషయమై ఇద్దరి మధ్య గొడవలు జరిగేవి. గురువారం గొడవ తారాస్థాయికి చేరటంతో ఆగ్రహానికి గురైన గురుప్రీత్‌ ఆమెను పెనంతో కొట్టి చంపి అక్కడి నుంచి పరారయ్యాడు. ఆమె సోదరుడు గురుప్రీత్‌కు ఫోన్‌ చేయగా.. అతని మాటలు అనుమానానికి దారితీశాయి. అనుమానంతో చెల్లెలి కోసం ఇంటికి వెళ్లి చూడగా.. సోదరి విగతజీవిగా పడి ఉండటంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న గురుప్రీత్‌ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. 

మరిన్ని వార్తలు