చంపేసి.. దుప్పట్లో శవాన్ని తీసుకొచ్చి

27 Jun, 2019 07:36 IST|Sakshi
బుడ్డమ్మ మృతదేహం బుడ్డమ్మ (ఫైల్‌)

కర్రతో భార్యను కొట్టి చంపిన భర్త

పొలం నుంచి ఇంటికి వస్తుండగా దాడి

అనంతరం మృతదేహాన్ని ఇంటికి తీసుకొచ్చిన వైనం

షాబాద్‌(చేవెళ్ల): కుటుంబ కలహాలతో భర్త తన భార్యను కడతేర్చిన సంఘటన రంగారెడ్డి జిల్లా షాబాద్‌ మండలంలోని బిక్యాతండాలో చోటు చేసుకుంది. షాబాద్‌ ఎస్‌ఐ రవికుమార్‌ కథనం ప్ర కారం.. మండలంలోని మద్దూర్‌ అనుబంధ బిక్యాతండాకు బుడ్డమ్మ(35), కేతావత్‌ తావ్‌ దంపతు లు.  వీరికి ఇద్దరు కూతుర్లు, ఒక కుమారుడు ఉన్నా రు. పెద్ద కూతురు వివాహం కూడా అయిపోయింది. తాగుడుకు బానిసైన కేతావత్‌ తావ్‌ డబ్బులు ఇవ్వాలని భార్యతో నిత్యం గొడవ పడేవాడు. ఈ విషయమై బుడ్డమ్మ తల్లిదండ్రులు పలుమార్లు అల్లుడుకి నచ్చజెప్పినా అతడిలో మార్పురాలేదు. మంగళవారం ఉదయం పొలం పనికి వెళ్లిన దంపతులిద్దరూ సాయంత్రం ఇంటికి చేరే సమయంలో మార్గమధ్యలోనే గొడవపడ్డారు. మాటమాటా పెరగడంతో భర్త తావ్‌ పక్కనే ఉన్న కర్రతో భార్య బుడ్డమ్మపై దాడి చేశాడు.

తీవ్రంగా గాయపడిన బుడ్డమ్మ అక్కడికక్కడే మృతిచెందింది. భార్య మృతదేహాన్ని దుప్పట్లో మూటకట్టుకొని ఇంటికి తీసుకువచ్చి పడుకోబెట్టాడు. బుధవారం తెల్లవారుజామున ఆమె నిద్ర లేవకపోవడంతో కుటుంబీకులు దగ్గరకు వెళ్లి చూసి బుడ్డమ్మ మృతిచెందినట్లుగా గుర్తించారు. తన సోదరి మృతికి ఆమె భర్తనే కారణమని, తాగుడుకు బానిసై భార్యను తరచూ వేధించేవాడని మృతురాలి సోదరుడు అంగోతు దాస్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. చేవెళ్ల ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబీకులకు అప్పగించిన పోలీసులు ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

మరిన్ని వార్తలు