ప్రియుడితో ఉన్న భార్య హత్య

17 Apr, 2019 09:02 IST|Sakshi

తమిళనాడు, సేలం: ప్రియుడితో కలిసి పడకపై ఉన్న భార్యను దారుణంగా హత్య చేసిన భర్త, ఆమె తలను బైకుపై పెట్టుకుని షికారు చేసిన సంఘటన ఈరోడ్‌ జిల్లాలో సోమవారం రాత్రి చోటు చేసుకుంది. ఈరోడ్‌ జిల్లా పెరుందురై వేప్పంపాళయం ప్రాంతానికి చెందిన మునియప్పన్‌ (28) గ్యాస్‌ సిలిండర్‌ లోడ్‌ తీసుకెళ్లే పని చేస్తుంటాడు. ఇతని భార్య నివేద డిపార్ట్‌మెంటల్‌ దుకాణంలో పని చేస్తుంది. ఈ క్రమంలో మునియప్పన్‌ సోమవారం రాత్రి ఎప్పటిలానే పనికి వెళ్లాడు. అయితే పని లేకపోవడంతో ఇంటికి తిరిగి వచ్చాడు. భార్య నివేద వేరొక వ్యక్తితో పడకపై కనిపించింది. ఆ దృశ్యాన్ని చూసిన మునియప్పన్‌ దిగ్భ్రాంతి చెందాడు. భార్యతో ఉన్న వ్యక్తి అక్కడి నుంచి పరారయ్యాడు.

దీంతో భార్యభర్తల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. తర్వాత ఆమెను పుట్టింటికి పంపడానికి బైకుపై తీసుకెళ్లాడు. ఎరుకంకాట్టువలసు వద్ద వస్తున్న సమయంలో మళ్లీ వాళ్ల మధ్య గొడవ జరిగింది. తీవ్ర ఆవేశానికి గురైన మునియప్పన్‌ తన వద్ద ఉన్న కత్తితో భార్య గొంతు కోశాడు. తర్వాత ఆమె తలను బైకు పెట్రోల్‌ ట్యాంకుపై ఉంచుకుని ఆమె దేహాన్ని బైకులో తన వెనుక కూర్చోపెట్టుకుని రోడ్డుపై షికారుగా వెళ్లాడు. ఒక ఇంటి వద్ద బైకు అదుపు తప్పి తల కింద పడిపోవడంతో స్థానికులు గుర్తించారు. సమాచారం అదుకున్న పెరుందురై పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మునియప్పన్‌ను అరెస్టు చేశారు. నివేద మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని శవపంచనామా నిమిత్తం ఈరోడ్‌ జీహెచ్‌కు తరలించారు. పెరుందురై పోలీసులు  విచారణ చేస్తున్నారు.

మరిన్ని వార్తలు