ఆస్తి కోసం భార్య హత్య

4 Sep, 2018 13:46 IST|Sakshi
నరుకుర్తి నాగరాజు, అప్పయమ్మ(ఫైల్‌ ఫొటో)

గొంతు కోసి చంపిన భర్త

కాకినాడ రేచర్లపేటలో ఘటన

తూర్పుగోదావరి ,కాకినాడ రూరల్‌: కాకినాడ రేచర్లపేటలో భార్యాభర్తల మధ్య తలెత్తిన ఆస్తి తగాదాల్లో భర్త, భార్య పీక కోసి హత్య చేశాడు. ఆర్టీసీ బస్టాండ్‌ వెనుక భాగంలో ఉన్న రేచర్లపేటలో సోమవారం ఈ సంఘటన చోటుచేసుకుంది. దీంతో  రేచర్లపేటలో విషాదం నెలకొంది. రేచర్లపేటకు చెందిన నరుకుర్తి నాగరాజు, అప్పయమ్మ (65)లు భార్యభర్తలు. అప్పయ్యమ్మ నాగరాజుకు రెండో భార్య. అప్పయ్యమ్మకు పిల్లలు పుట్టలేదు. ఈమె గల్ఫ్‌లో కొన్నాళ్లు ఉండి డబ్బు సంపాదించగా, నాగరాజు మున్సిపాలిటీలో ఉద్యోగం చేసి పదవీ విమరణ చేశాడు. అప్పట్లో ఇద్దరు కలసి పిఠాపురం మండలం రాపర్తిలో రెండు ఎకరాల భూమి, రేచర్లపేటలో రెండంతస్తుల డాబా ఇల్లు సంపాదించారు.

ఈ రెండు కూడా మృతురాలి అప్పయమ్మ పేరున ఉండడంతో  అప్పయమ్మ రాపర్తిలో ఉన్న భూమిలో తన మేనల్లుడికి 40 సెంట్ల భూమి ఒకసారి, 50 సెంట్లు భూమి మరోసారి రిజిస్ట్రేషన్‌ చేసి ఇచ్చేసింది. ఇది భర్త నాగరాజుకు నచ్చలేదు. నిత్యం  భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మళ్లీ మిగిలిన భూమిని ఇంటిని తన మేనల్లుడికి రాయించి ఇస్తానని చెబుతుండడంతో సహించలేని నాగరాజు సోమవారం తెల్లవారుజామున అప్పయమ్మ పీక కోసి హత్యచేశాడు. హత్య చేసిన వెంటనే నాగరాజు టూటౌన్‌ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. సంఘటన స్థలాన్ని డీఎస్పీ రవివర్మ, టూటౌన్‌ సీఐ ఎండీ ఉమర్‌ సందర్శించి పరిశీలించారు. అప్పయమ్మ మృతిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, ఈ హత్య నాగరాజు ఒక్కరే చేసారా? లేక మరెవరైనా ఉన్నారా? అనే కోణంలో దర్యాప్తు చేస్తామని డీఎస్పీ వివరించారు.

>
మరిన్ని వార్తలు