విడాకులు కోరిందని..

23 Feb, 2019 07:58 IST|Sakshi

భార్యను కడతేర్చిన భర్త

దాడిలో కుమార్తెకి తీవ్రగాయాలు

అన్నానగర్‌: దిండుక్కల్‌ సమీపంలో గురువారం విడాకులు కోరిన భార్యని భర్త దారుణంగా కత్తితో నరికి హత్య చేశాడు. ఈ దాడిలో అతని కుమార్తెకు తీవ్రగాయాలయ్యాయి. వివరాలు.. దిండుక్కల్‌ సమీపంలోని తాడిక్కొంబు, కోట్టూర్‌ ఆవారంపట్టికి చెందిన సెల్వరాజ్‌ (45). ఇతను వేడచందూర్‌లో ప్రభుత్వ రవాణా శాఖలో బస్సు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఇతని భార్య శశికళ (35). వీరి కుమార్తె పునిత(14) దిండుక్కల్‌లోని ప్రైవేట్‌ పాఠశాలలో 7వ తరగతి చదువుతోంది. కాగా కుటుంబ కలహాలతో భార్య భర్తలు తరుచూ గొడవపడేవారని తెలిసింది. అనంతరం సెల్వరాజ్, శశికళ విడిపోయారు. సెల్వరాజ్‌ దాడిక్కొంబు అరుణాచలం నగర్‌లో ఉంటున్నాడు.

శశికళ దాడిక్కొంబు అగరంలో ఉన్న తల్లిదండ్రుల ఇంట్లో కుమార్తె సహా ఉంటోంది. ఈ క్రమంలో శశికళ భర్త నుంచి విడాకులు కోరుతూ దిండుక్కల్‌లోని కోర్టులో కేసు వేసింది. ఈ కేసు వచ్చే వారం విచారణకు రానుంది. భార్య విడాకులు అడగడంతో సెల్వరాజ్‌ ఆగ్రహంతో ఊగిపోయాడు. గురువారం జరిగిన వారపుసంతలో శశికళ, పునిత వస్తువులు కొనుగోలు చేశారు. తిరిగి ఇంటికి నడుస్తూ వస్తున్నారు. అప్పుడు వారి వెనుక బైకుపై వచ్చిన సెల్వరాజ్‌ పునితా, శశికళని నరికాడు. ఇందులో శశికళ సంఘటన స్థలంలోనే మృతి చెందింది. పునిత తీవ్ర గాయాలయ్యాయి. అనంతరం సెల్వరాజ్‌ అక్కడ నుంచి పరారయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి వచ్చి పునితాని చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు విచారణ చేస్తున్నారు.   

మరిన్ని వార్తలు