కట్టుకున్నోడే కడతేర్చాడు

19 Nov, 2018 07:55 IST|Sakshi
విలపిస్తున్న కుటుంబ సభ్యులు  దానమ్మ(ఫైల్‌)

యైటింక్లయిన్‌కాలనీ(రామగుండం): నిండు నూరేళ్లు తోడుగా ఉంటానని బాస చేసిన కట్టుకున్నోడే కాలయముడయ్యాడు. భార్యను రోకలిబండతో మోది హతమార్చిన ఘటన ఆదివారం యైటింక్లయిన్‌కాలనీలో జరిగింది. గోదావరిఖని టూటౌన్‌ సీఐ వెంకటేశ్వర్లు తెలిపిన వివరాలు. యైటింక్లయిన్‌కాలనీ రాజీవ్‌నగర్‌తండాలో నివసించే వృద్ధురాలు బానోతు దానమ్మ(65), ధర్మయ్య భార్యభర్తలు. ఆదివారం తెల్లవారుజామున ధర్మయ్య తన భార్య తలపై రోకలిబండతో మోది దారుణంగా హతమార్చాడు. మందమర్రి ఏరియాలో సింగరేణి ఉద్యోగం చేసి పదేళ్లక్రితం రిటైర్డ్‌ అయి తన అత్తగారి ఊరిలో ఇల్లు కొనుక్కుని భార్యతో కలిసి ఉంటున్నారు. అనారోగ్య సమస్యలతో తరచూ ఇబ్బందులు పడుతున్న ధర్మయ్యను భార్య సరిగా చూడడం లేదని మనసులో పెట్టుకున్నాడు. ఈక్రమంలో మంచంపైన నిద్రిస్తున్న దానమ్మ తలపై రోకలిబండతో మోది హత్య చేశాడు.  
భర్తకు చిన్న ఆపదొచ్చినా.. 
తరచూ అనారోగ్యంతో బాధపడే ధర్మయ్యకు చిన్న సమస్య తలెత్తిన భార్యే దగ్గరుండి ఆసుపత్రికి తీసుకెళ్లి బాగుచేయించుకుని తీసుకొచ్చేదని స్థానికులు చర్చించుకుంటున్నారు. గతంలో రెండుసార్లు భర్త ప్రాణాలమీదకొస్తే దానమ్మ దగ్గరుండి వైద్యం చేయించిందని తెలిపారు. పెద్ద కూతురు రాజమ్మ ఇచ్చిన ఫిర్యాదుతో గోదావరిఖని టూటౌన్‌ సీఐ వెంకటేశ్వర్లు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతురాలికి ఇద్దరు కూతుళ్లు ఉన్నారు.

మరిన్ని వార్తలు