కట్టుకున్న భర్తే కాలయముడు

31 Aug, 2019 11:59 IST|Sakshi

సాక్షి, విజయవాడ రూరల్‌: భర్తే కాలయముడై భార్యను కిరాతకంగా హత్య చేసిన ఘటన విజయవాడ రూరల్‌ మండలంలో జరిగింది. అనుమానమే పెనుభూతంగా మారింది. దీంతో కట్టుకున్న భార్యను రోకలి బండతో దారుణంగా హతమార్చాడు. పోలీసుల కథనం ప్రకారం నిడమానూరు రామ్‌నగర్‌కు చెందిన సోమేలు లారీ డ్రైవర్‌గా పని చేస్తున్నారు. అతడికి భార్య అశ్విని, ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే అశ్విని మరొకరితో సన్నిహితంగా ఉంటుందంటూ గత కొద్దిరోజులుగా సోమేలు గొడవ పడుతున్నాడు.

ఇదే విషయంపై గతరాత్రి భార్యాభర్తల మధ్య ఘర్షణ జరిగింది. అనంతరం ఇంట్లో నుంచి వెళ్లిపోయిన అతడు శనివారం ఉదయం తిరిగి వచ్చాడు. ఉదయం తలుపు తీసిన భార్యను చూడగానే సోమేలు పట్టరాని కోపంతో రోకలి బండతో తలపై బలంగా కొట్టాడు. దీంతో అశ్విని అక్కడిక్కడే కుప్పకూలి ప్రాణాలు విడిచింది. అనంతరం సోమేలు పోలీస్‌ స్టేషన్‌లో లొంగిపోయాడు. అంతేకాకుండా భార్య మరొకరితో సన్నిహితంగా ఉన్న ఫోటోలను పోలీసులకు అందచేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టంకు తరలించారు.

కాగా అశ్వినిని చంపేశానంటూ అల్లుడు ఫోన్‌ చేసి చెప్పాడని, అయితే తాము నమ్మలేదని, కోపంలో అలా చెబుతున్నాడేమో అనుకున్నామంటూ మృతురాలి తల్లి విలపించింది. కూతురు, అల్లుడికి గొడవ జరిగిందని, ఇదే విషయం ఫోన్‌లో చెప్పారని, ఉదయం వచ్చి మాట్లాడతామని చెప్పామని, ఇంతలోనే ఈ దారుణం జరిగిందని ఆమె పేర్కొంది. 


 

మరిన్ని వార్తలు