భార్య కాపురానికి రాలేదని.. భర్త బలవన్మరణం

16 Aug, 2019 10:16 IST|Sakshi
మృతి చెందిన నరసింహులు

సాక్షి, బొమ్మలసత్రం, కర్నూలు: ప్రేమించి పెళ్లిచేసుకుని కాపురం చేసిన పదేళ్ల తర్వాత వారి మధ్య విభేదాలు రావటాన్ని జీర్ణించుకోలేక చివరకు ఓ యువకుడు విష గులికలు మింగి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నంద్యాల పట్టణంలో గురువారం చోటుచేసుకుంది. త్రీటౌన్‌ సీఐ శివశంకర్‌ తెలిపిన వివరాలు.. శిరివెళ్లకు చెందిన సజ్జల నరసింహులు(32) నంద్యాల పట్టణంలోని దేవనగర్‌కు చెందిన షేక్‌ ఆశాను ప్రేమించి, పదేళ్ల క్రితం కులాంతర వివాహం చేసుకున్నాడు. వీరికి కుమారుడు, కుమార్తె ఉన్నారు.

సాఫీగా సాగిపోతున్న వీరి కాపురంలో మూడు నెలల క్రితం మనస్పర్ధలు వచ్చాయి. తరచూ గొడవలు జరిగాయి. ఈక్రమంలో ఆశా ఫిర్యాదు మేరకు నరసింహులుపై స్థానిక త్రీటౌన్‌ పోలీస్టేషన్‌లో గృహ హింస చట్టం కింద కేసు నమోదైంది. రిమాండ్‌కు వెళ్లి తిరిగి వచ్చిన అనంతరం తిరిగి భార్య, పిల్లల కోసం దేవనగర్‌లోని ఆశా ఇంటి వద్దకు వెళ్లాడు. నరసింహులును కలవటానికి ఆశా నిరాకరించటంతో బుధవారం అర్ధరాత్రి విషగులికలు మింగాడు. గమనించిన ఆశా వెంటనే నరసింహులును స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించింది. చికిత్స పొందుతూ కోలుకోలేక గురువారం ఉదయం మృతిచెందాడు. నరసింహులు తండ్రి పెద్దనర్సయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టామని సీఐ శివశంకర తెలిపారు.  

మరిన్ని వార్తలు