రెండో భార్యతో కలిసి భర్త ఆత్మహత్య

15 Dec, 2019 04:48 IST|Sakshi

 కుటుంబ కలహాలతో బలవన్మరణం

పెద్దపంజాణి (చిత్తూరు జిల్లా): కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ వ్యక్తి తన రెండో భార్యతో కలసి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన చిత్తూరు జిల్లా పెద్దపంజాణి మండలంలో శనివారం చోటుచేసుకుంది. పెద్దపంజాణి ఎస్‌ఐ లోకేష్‌రెడ్డి కథనం మేరకు.. పెద్దపంజాణి మండలం పెనుగొలకల గ్రామానికి చెందిన అమరనాథ్‌కు 2014లో మదనపల్లె మండలం నాయునివారిపల్లికి చెందిన సంధ్యారాణితో వివాహమైంది. వారికి స్నేహప్రియ (3) సంతానం ఉంది. బతుకు దెరువు కోసం నాలుగేళ్ల క్రితం అమరనాథ్‌ (32) భార్య సంధ్యారాణి, కుమార్తె స్నేహప్రియతో కలిసి బెంగళూరుకు వెళ్లాడు. కోరమంగలలోని ఓ హోటల్లో పనిచేస్తూ అద్దె ఇంట్లో ఉంటున్నాడు. అదే హోటల్‌లో పని చేస్తున్న త్రిపుర రాష్ట్రానికి చెందిన అంజలీనాథ్‌ (23)ను రెండో పెళ్లి చేసుకుని వేరు కాపురం పెట్టించాడు.

గురువారం అమరనాథ్, అతని మొదటి భార్య సంధ్యారాణి పెళ్లి రోజు. ఆరోజు అంజలీనాథ్‌ మొదటి భార్య సంధ్యారాణి ఇంటికి వచ్చి, కేక్‌ ఇచ్చేందుకు వచ్చానని చెప్పి కొంతసేపు ఉండి వెళ్లిపోయింది. ఇంటికి చేరుకున్న అమరనాథ్‌ను సంధ్యారాణి నిలదీసింది. ఆ మహిళను తాను రెండో వివాహం చేసుకున్నానని చెప్పడంతో గొడవ జరిగింది. శుక్రవారం ఉదయం ఇంటికి వచ్చిన అమరనాథ్‌ ‘‘మేము చస్తే నీకు ఎటువంటి బాధ ఉండదు’ అని చెప్పి వెళ్లిపోయాడు. తర్వాత రెండో భార్య అంజలీనాథ్‌తో కలిసి ద్విచక్రవాహనంలో బెంగళూరు నుంచి స్వగ్రామమైన పెనుగొలకలకు చేరుకున్నాడు. గ్రామ సమీపంలోని తన సొంత పొలంలోని ఓ చెట్టుకు ఇద్దరూ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. శనివారం సంధ్యారాణి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

మరిన్ని వార్తలు