భార్య చిత్రాలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసిన భర్త

9 Sep, 2019 08:43 IST|Sakshi

భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు

చండీగఢ్‌: భార్యకు రక్షణ కల్పించాల్సిన భర్తే ఆమె వ్యక్తిగత వివరాలను అంగట్లో పెట్టాడు. భార్య రహస్య చిత్రాలను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తూ.. ఆమెను తీవ్ర వేధింపులకు గురిచేస్తున్నాడు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దీనిపై విచారిస్తున్నారు. వివరాలు.. హర్యానాకు చెందిన ఓ వ్యక్తి గుర్‌గావ్‌లో ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. అతనికి 12 ఏళ్ల క్రితం వివాహమయింది. కొంతకాలం పాటు సంతోషంగానే సాగిన వీరి వైవాహిక జీవితంలో మనస్పర్థలు చోటుచేసుకున్నాయి. దీంతో ఇక తమ వివాహ జీవితానికి ముగింపు పలకాలని భార్యభర్తలిద్దరూ నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో స్థానిక కోర్టులో విడాకుల కోసం ధరఖాస్తు చేసుకున్నారు. కేసు ప్రస్తుతం కోర్టులో పెండింగ్‌లోఉంది.

ఇదిలావుండగా.. గతకొంత కాలం నుంచి తన వ్యక్తిగత ఫోటోలను తన భర్త సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తూ తనను తీవ్ర వేధింపులకు గురిచేస్తున్నాడని అతని భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇద్దరం కలిసున్న రహస్య చిత్రాలను బయటపెడుతూ.. తన పరువుకు భంగం కలిగిస్తున్నాడని పేర్కొంది. ఆమె ఫిర్యాదు స్వీకరించిన మానేశ్వర్‌ పోలీసులు, కేసును మహిళా, సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు బదిలీ చేసి విచారణకు ఆదేశించారు. దీనిపై మహిళా స్టేషన్‌ అధికారి కవిత మాట్లాడుతూ.. ఐపీసీ సెక్షన్‌ 509 కింద కేసు నమోదు చేశామని, విచారణ అనంతరం అతనిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

మరిన్ని వార్తలు