ఆ నలుగురిని అరెస్ట్‌ చేసిన పోలీసులు

17 Mar, 2018 20:54 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సీటీ(హెచ్‌సీయూ) విద్యార్థినిపై అత్యాచారయత్నం చేసిన దుండగులను మాదాపూర్‌ పోలీసులు అరెస్టు చేశారు. డీసీపీ విశ్వప్రసాద్‌ తెలిపిన వివరాల ప్రకారం.. శుక్రవారం సాయంత్రం యూనివర్సీటీకి చెందిన ఓ యువతి ప్రవీణ్‌ అనే తన స్నేహితునితో కలిసి నల్లగండ్ల లేక్‌ వద్దకు వెళ్లింది. అక్కడే మాటు వేసి ఉన్న నలుగురు దుండగులు వీరిద్దరిని బెదిరించి డబ్బులు డిమాండ్‌ చేస్తూ అసభ్యంగా ప్రవర్తించారు. వారి వద్ద ఉన్న డబ్బులు లాక్కున్నారు.

అనంతరం ఆ నలుగురు యువతిపై లైంగికదాడికి యత్నించారు. ఆమె తన స్నేహితుడు ప్రవీణ్‌ సాయంతో దుండగుల నుంచి తప్పించుకొని బయటపడింది. అనంతరం యూనివర్సిటీ మిత్రులతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు ఈ మేరకు రంగంలోకి దిగి డాగ్‌ స్క్వాడ్‌ సాయంతో దుండగులని పట్టుకున్నామని డీసీపీ తెలిపారు. అయితే ఆ నలుగురు మైనర్లు కావడం గమనార్హం. వారిలో ఇద్దరు పాత నేరస్తులేనని డీసీపీ పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు