మధ్యాహ్నం మీడియా ముందుకు కీర్తి, శశికుమార్‌

31 Oct, 2019 11:52 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కీర్తి తల్లి రజిత హత్య కేసులో నిందితులను రాచకొండ పోలీస్‌ కమిషనర్‌ మహేష్‌ భగవత్‌ మధ్యాహ్నం మీడియా ముందు ప్రవేశపెట్టనున్నారు. పెళ్లికి నిరాకరించిందనే కోపంతో హయత్‌నగర్‌కు చెందిన పల్లెర్ల కీర్తి ప్రియుడితో కలిసి కన్నతల్లినే హతమార్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న కీర్తి, ఆమె ప్రియుడు శశికుమార్‌ను హయత్‌నగర్‌ పోలీసులు అరెస్టు చేశారు. పలు కోణాల్లో విచారణ జరిపిన అనంతరం గురువారం మధ్యాహ్నం మూడు గంటలకు సీపీ నిందితులను మీడియా ముందుకు తీసుకురానున్నారు.(చదవండి : కీర్తికి మద్యం తాగించి‌.. రజిత గొంతు నులిమిన శశి)

కాగా తల్లిని దారుణంగా హతమార్చి ఆ నేరాన్ని తండ్రిపై నెట్టివేయాలని చూసిన కీర్తి కేసులో పలు సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇద్దరు యువకులతో ప్రేమలో మునిగిన కీర్తిని తల్లి మందలించడంతోనే ఆమె ఈ ఘాతుకానికి పాల్పడింది. మొదట శశికుమార్‌తో ప్రేమలో పడిన కీర్తి.. తర్వాత బాల్‌రెడ్డికి దగ్గర కావడంతో వారిద్దరికి పెళ్లి చేసేందుకు తల్లిదండ్రులు సూత్రప్రాయ అంగీకారం తెలిపారు. అయితే ఈ విషయం తెలుసుకున్న శశికుమార్‌ కీర్తితో తాను సన్నిహితంగా ఉన్న వీడియోలను సోషల్‌ మీడియాలో పెడతానంటూ ఆమెను బెదిరించాడు. దీంతో కీర్తి మళ్లీ శశికుమార్‌కు దగ్గరైంది. ఈ నేపథ్యంలో ఈనెల 19న కూరగాయల మార్కెట్‌ నుంచి కీర్తి తల్లి రజిత ఇంటికి వచ్చిన సమయంలో అక్కడికి చేరకున్న శశికుమార్‌.. కీర్తికి మద్యం తాగించి తల్లిని హత్య చేసేలా ప్రేరేపించాడు. ఈ క్రమంలో కీర్తి తల్లి ముఖంపై దిండుతో అదిమి పట్టగా.. శశికుమార్‌ ఆమెకు చున్నీతో ఉరి బిగించి హత్య చేశాడు. ఈ కేసులో కీర్తి మరో ప్రియుడు బాల్‌రెడ్డి హస్తం కూడా ఉందా అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు.

మరిన్ని వార్తలు