పాండిచ్చేరి బీచ్‌లో నగర వాసి గల్లంతు

11 Feb, 2020 08:48 IST|Sakshi
నిఖిల్‌రెడ్డి (ఫైల్‌)

కుషాయిగూడ: మిత్రులతో కలిసి విహారయాత్రకు వెళ్లిన ఓ యువకుడు బీచ్‌లో గల్లంతయ్యాడు. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. కుషాయిగూడ సాయినగర్‌ కాలనీకి నారెడ్డి ప్రతాప్‌రెడ్డి, రేణుక దంపతుల రెండో కుమారుడు నారెడ్డి నిఖిల్‌రెడ్డి అలియాస్‌ బంటి(22) బీటెక్‌ పూర్తిచేశాడు. రెండు నెలల క్రితమే గచ్చిబౌలిలోని లీవ్‌ స్పేస్‌ ఇంటీరియల్‌ కంపెనీలో జాబ్‌లో చేరాడు. కంపెనీకి చెందిన మిత్రులతో కలిసి గత శనివారం చెన్నై టూర్‌కు వెళ్లాడు. సోమవారం సాయంత్రం అంతా కలిసి పాండిచ్చేరి బీచ్‌కు వెళ్లారు.

అందరు కలిసి సరదాగా స్నానాలు చేసి బయటకు వచ్చారు. వారిలో ఒకరు అలల్లో చిక్కుకొని హెల్ప్‌.. హెల్ప్‌ అంటూ కేకలు పెట్టాడు. గమనించిన నిఖిల్‌రెడ్డి కాపాడేందుకు సముద్రంలోకి వెళ్లి అతణిన బయటకు లాగాడు. అదే సమయంలో ఉవ్వెత్తుగా అలలు ఎగిసిపడటంతో నిఖిల్‌రెడ్డి అలల్లో కొట్టుకుపోయాడు. దీంతో ఆందోళన చెందిన తోటి మిత్రులు నిఖిల్‌రెడ్డి ఆచూకీ కోసం ఎంత ప్రయత్నించినా ఫలితం లేకుండాపోయింది. విషయాన్ని నిఖిల్‌ కుటుంబ సభ్యులకు ఫోన్‌లో సమాచారం అందించి పాండిచ్చేరి కోటకుప్పం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. 

మరిన్ని వార్తలు