కొడుకులను దొంగలుగా మార్చిన అమ్మ..

16 Jun, 2018 13:40 IST|Sakshi

అవసరమైనప్పుడల్లా చోరీలు చేయమని ఆదేశం 

మూడున్నరేళ్లలో 33 దొంగతనాలు 

వెస్ట్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌కు చిక్కిన చోర త్రయం 

రూ.75 లక్షల విలువైన చోరీ సొత్తు స్వాధీనం 

ఈ దొంగల తల్లి టీఆర్‌ఎస్‌ కార్వాన్‌ అధ్యక్షురాలు కూడా.. 

సాక్షి, హైదరాబాద్‌: ప్రపంచంలో ఏ తల్లైనా పిల్లలకు సుద్ధులు చెబుతుంది. చక్కగా చదువుకుని ఉన్నతంగా ఎదగాలని హితబోధ చేస్తుంది. అయితే చాంద్రాయణగుట్ట షహీన్‌నగర్‌కు చెందిన సనా బేగం మాత్రం అందుకు పూర్తి విరుద్ధం. తన ముగ్గురు కుమారుల్లో ఇద్దరిని దొంగలుగా మార్చింది. డబ్బు అవసరమైనప్పుడల్లా చోరీ చేసుకురమ్మంటూ పంపిస్తుంటుంది. దొంగతనం చేసుకువచ్చిన బంగారం అమ్మడంలో సహకరిస్తుంది. ఈ తల్లీ కొడుకులు గడిచిన మూడున్నరేళ్ల కాలంలో మొత్తం 33 నేరాలు చేశారు. వీరికి చెక్‌ చెప్పిన వెస్ట్‌ జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు 1.65 కేజీల బంగారంతో సహా రూ.75 లక్షల విలువైన సొత్తు స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం నగర పోలీసు కమిషనర్‌ అంజనీ కుమార్‌.. వెస్ట్‌ జోన్, టాస్క్‌ఫోర్స్‌ డీసీపీలు ఏఆర్‌ శ్రీనివాస్, పి.రాధాకిషన్‌రావుతో కలిసి పూర్తి వివరాలు వెల్లడించారు.  

ఓ పార్టీ మహిళా అధ్యక్షురాలిగా ఉంటూ.. 
పశ్చిమ మండలంలోని టోలిచౌకి ప్రాంతానికి చెందిన సనాబేగం(35) అలియాస్‌ నజమున్నీసాకు పదకొండో ఏటనే సయ్యద్‌ సర్వర్‌తో వివాహమైంది. పెళ్లైన తర్వాత భర్త ప్రోద్భలంతో పదో తరగతి వరకు చదివింది. ఆపై భర్తతో స్పర్థలు రావడంతో 21వ ఏట విడాకులు తీసుకుంది. అప్పటికే ఈమెకు ముగ్గురు కొడుకులు (సయ్యద్‌ మహ్మద్, సయ్యద్‌ సొహైల్, సయ్యద్‌ సాహిల్‌) పుట్టారు. చాంద్రాయణగుట్టలోని షహీన్‌నగర్‌కు చెందిన ఆటోడ్రైవర్‌ మహ్మద్‌ అబ్దుల్‌ షకీల్‌ను రెండో వివాహం చేసుకున్న సనా.. తన మకాంను అక్కడకు మార్చింది. ప్రస్తుతం కార్వాన్‌ నియోజకవర్గం టీఆర్‌ఎస్‌ పార్టీ మహిళా అధ్యక్షురాలిగా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుత ఎమ్మెల్యేకు, ఈమెకు మధ్య నిత్యం ఆధిపత్యపోరు సాగుతోంది. కేవలం తొమ్మిది, పదో తరగతులు మాత్రమే చదివిన తన ముగ్గురు కుమారులకు వివాహాలు చేసిన సనా.. కోడళ్లతో కలిసి నివసిస్తోంది. ఎనిమిది మందితో కూడిన ఈ సంసారాన్ని నడపడానికి సరైన ఆదాయ వనరులు లేకపోవడంతో తొలినాళ్లల్లో ఇబ్బందులు ఎదుర్కొంది. తన భర్త ఆటో నడపడం, రెండో కుమారుడు సోహైల్‌ కారు నడపటం ద్వారా వచ్చే సొమ్ముతో బతుకీడ్బటం కష్టంగా మారింది. దీంతో చోరీల పంధా ఎంచుకొంది. 

మూడున్నరేళ్ల నుంచి చోరీల బాట.. 
విలాసవంతమైన జీవితం గడపాలనే తన కోరిక తీర్చుకోవడానికి పెద్ద, చిన్న కుమారులైన మహ్మద్‌ (20), సాహిల్‌(18)ను దొంగలుగా మార్చింది. అవసరాల కోసం చోరీలు చేస్తే తప్పులేదంటూ నూరిపోసింది. దీంతో వీరిద్దరూ 2015 మార్చి నుంచి దొంగతనాలు చేయడం ప్రారంభించారు. ద్విచక్ర వాహనంతో పాటు హోండా అకార్డ్‌ కారులో తిరుగుతూ ఖరీదైన కాలనీల్లో రెక్కీలు చేస్తారు. తాళం వేసున్న ఇల్లు కనిపిస్తే చాలు పగలు, రాత్రి తేడా లేకుండా కిటికీ, గ్రిల్స్‌ పగులకొట్టి లోపలకు ప్రవేశిస్తారు. బంగారం, వెండి, నగదుతో పాటు ఇతర ఖరీదైన వస్తువులూ చోరీ చేసి ఉడాయిస్తారు. కారులో వెళ్లినప్పుడు మాత్రమే ఆ ఇంట్లో ఉన్న టీవీ తదితరాలు ఎత్తుకువస్తారు. అలా కానప్పుడు కేవలం వెండి, బంగారం, నగదుతో ‘సర్దుకుపోతారు’. ఇలా చోరీ చేసిన సొత్తును తమ తల్లితో కలిసి చార్మినార్‌ ప్రాంతంలో నూర్‌ జ్యువెలర్స్‌ దుకాణం నిర్వహిస్తున్న మహ్మద్‌ నూరుద్దీన్‌కు విక్రయిస్తుంటారు. ఈ పంథాలో గడిచిన మూడున్నరేళ్ల కాలంలో వీరు హైదరాబాద్, సైబరాబార్‌ కమిషనరేట్ల పరిధిలో 33 నేరాలు చేశారు.  

ఎట్టకేలకు పట్టుకున్న టాస్క్‌ఫోర్స్‌.. 
ఇలా వరుస పెట్టి నేరాలు చేస్తూ పోలీసులకు చిక్కకుండా తప్పించుకు తిరుగుతున్న ఈ తల్లీకొడుకులు విలాసవంతంగా బతుకుతున్నారు. పెద్ద కుమారుడి పుట్టిన రోజు కోసం ఏకంగా సనాబేగం రూ. 6 లక్షలు ఖర్చు చేసి పార్టీ చేసింది. ఈ కేసులను ఛేదించేందుకు రంగంలోకి దిగిన పశ్చిమ మండల టాస్క్‌ఫోర్స్‌ ఇన్‌స్పెక్టర్‌ బి. గట్టుమల్లు నేతృత్వంలోని బృందం సాంకేతిక ఆధారాలు సేకరించింది. వీరి వ్యవహారశైలి పైనా సమాచారం అందిన నేపథ్యంలో శుక్రవారం అదుపులోకి తీసుకుని విచారించింది. ఈ నేపథ్యంలో పూర్తి వివరాలు వెలుగులోకి రావడంతో సనా, మహ్మద్, సాహిల్‌తో పాటు నూర్‌ మహ్మద్‌ను అరెస్టు చేసింది. వీరి నుంచి నేరాలు చేయడానికి వాడిన కారు, ద్విచక్ర వాహనంతో పాటు 1.65 కేజీల బంగారం, ఎలక్ట్రానిక్‌ వస్తువులతో కలిపి మొత్తం రూ.75 లక్షలు విలువైన సొత్తు స్వాధీనం చేసుకుంది. ఘరానా నేర చరిత్ర ఉండి, తొలిసారిగా చిక్కిన ఈ ముగ్గురి పైనా పీడీ యాక్ట్‌ ప్రయోగిస్తామని కొత్వాల్‌ అంజనీ కుమార్‌ తెలిపారు.  

వీరి దారి.. వెనుక దారి
సనాబేగం డైరెక్షన్‌లో యాక్షన్‌లోకి దిగి చోరీలు చేసే కుమారులు సయ్యద్‌ మహ్మద్, సయ్యద్‌ సాహిల్‌ వ్యవహారశైలి ఆసక్తికరంగా ఉంది. చోరీ చేసే ప్రాంతాన్ని బట్టి కారు లేదా ద్విచక్ర వాహనంపై వెళ్లే ‘పుత్ర ద్వయం’ నిత్యం తమ వెంట ఓ కిట్‌ తీసుకెళుతుంది. అందులో స్క్రూడ్రైవర్, కటింగ్‌ ప్లేయర్, గ్రిల్‌ కట్టర్‌ వంటివి ఉంటాయి. తాళం వేసున్న ఇంటిని ఎంచుకునే వీరు దాని వెనుక కిచెన్‌ లేదా స్టోర్స్‌ ద్వారాన్ని పగులకొట్టి, గ్రిల్స్‌ తొలగించి, కిటికీ ఊచలు విరిచి లోనికి ప్రవేశిస్తారు. వెంటనే ముందు ప్రధాన ద్వారానికి లోపల నుంచి బోల్ట్‌ పెట్టేస్తారు. ఇలా చేయడం ద్వారా చోరీ చేస్తున్నప్పుడు ఇంటి యజమానులు వచ్చి తాళం తీసినా.. తలుపు రాకపోవడంతో కాసేపు గట్టిగా ప్రయత్నిస్తారు. ఈ అలికిడి వినే ఇరువురూ వెనుక వైపు నుంచి పారిపోతారు. దాదాపు 10 సందర్భాల్లో ఈ ద్వయం ఇలా తమ కాళ్లకు బుద్ధి చెప్పింది.  

ఘనంగా 18వ పుట్టిన రోజు.. 
తేలిగ్గా వచ్చే డబ్బుతో జల్సాలు చేస్తున్న సనా బేగం తన పెద్ద కుమారుడికి 2016లో అతడి 18వ పుట్టిన రోజును సెవెన్‌ టూంబ్స్‌ వద్ద ఉన్న ఎఫ్‌ఎఫ్‌ ఫంక్షన్‌ హాల్‌లో రూ.6 లక్షలు వెచ్చించి మరీ వేడుక చేసింది. తన ముగ్గురి కుమారుల పెళ్లిళ్లనూ చోరీ సొత్తు అమ్మగా వచ్చిన డబ్బుతోనే విలాసవంతంగా నిర్వహించింది. తన ఇద్దరి కుమారులతో కలిసి చోరీలు చేస్తున్నప్పటికీ ఈ విషయాన్ని తన రెండో కుమారుడు, డ్రైవర్‌ అయిన సోహైల్‌కు తెలియకుండా జాగ్రత్త పడింది. తస్కరించిన చోరీ సొత్తును చార్మినార్‌ సమీపంలోని గుల్జార్‌హౌస్‌ వద్ద నూర్‌ జ్యువెలర్స్‌ నిర్వహించే మహ్మద్‌ నూరుద్దీన్‌కు అమ్మేవారు. ఆ సొత్తుకు  ఇవ్వాల్సిన డబ్బును ఇతగాడు చెక్కుల రూపంలో ఇచ్చాడు.

దీంతో నూరుద్దీన్‌ను కూడా అరెస్టు చేశారు. మూడున్నరేళ్లుగా నేరాలు చేస్తూ తప్పించుకు తిరుగుతున్న అన్నదమ్ముల కదలికలు బంజారాహిల్స్‌లోని ఓ సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. దీని ఆధారంగా వెస్ట్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌కు మరో కీలక సమాచారం అందింది. షహీన్‌నగర్‌లో నివసిస్తున్న సనా అనే మహిళ, ఆమె కుమారులు ఎలాంటి పనీ చేయరని, అయితే విలాసవంతంగా బతుకుతారని వేగుల ద్వారా తెలిసింది. కేసులో కీలక పాత్ర పోషించిన ఇన్‌స్పెక్టర్‌ బి.గట్టుమల్లు, ఎస్సైలు వి.కిషోర్, ఎం.ప్రభాకర్‌రెడ్డి, పి.మల్లికార్జున్‌రెడ్డి, ఎల్‌.భాస్కర్‌రెడ్డి తదితరుల్ని కొత్వాల్‌ అభినందించి రివార్డులు అందించారు.  

మరిన్ని వార్తలు