బ్లాక్‌ మార్కెట్‌లో యాంటీ వైరల్‌ డ్రగ్స్‌ : ముఠా అరెస్ట్‌

14 Jul, 2020 18:15 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : నగరంలో యాంటీ వైరల్‌ డ్రగ్స్‌ను బ్లాక్‌ మార్కెట్‌లో విక్రయిస్తున్న ముఠాను పోలీసులు మంగళవారం అరెస్ట్‌ చేశారు. ఈ ఘటనకు సంబంధించి నగర పోలీసు కమిషనర్‌ అంజనీకుమార్‌ మీడియాతో మాట్లాడుతూ.. సౌత్‌ జోన్‌ టాస్క్‌ ఫోర్స్‌ పోలీసులు నేడు పాతబస్తీలో అంతరాష్ట్ర బ్లాక్‌ మార్కెట్‌ ముఠాను అరెస్ట్‌ చేశాను. కరోనా వైరస్‌ బారిన పడినవారికి 8 మంది బ్లాక్‌లో అక్రమంగా యాంటీ వైరల్‌ డ్రగ్స్‌ విక్రయిస్తున్నారని తెలిపారు. ముఠా సభ్యుల నుంచి 35.5 లక్షల రూపాయల విలువ చేసే మెడిసిన్‌ స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించారు. 

ఈ ముఠాలో వెంకట సుబ్రమణ్యం కీలకంగా వ్యవహరిస్తున్నాడని తెలిపారు. మెడిసన్స్‌ రూ. 10 వేల నుంచి రూ. 50 వేల వరకు బ్లాక్‌ మార్కెట్‌లో విక్రయిస్తున్నారని చెప్పారు. ముఠా సభ్యుల వద్ద నుంచి కరోనా టెస్ట్‌ చేసే ర్యాపిడ్‌ కిట్స్‌, ఇంజక్షన్లు స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించారు. ఈ కేసులో సౌత్‌ జోన్‌ టాస్క్‌ ఫోర్స్‌కు చార్మినార్‌ డ్రగ్‌ కంట్రోల్‌ అధికారులు సాయం చేశారని పేర్కొన్నారు. ఫార్మ కంపెనీల డిస్టిబ్యూటర్స్‌, మెడికల్‌ రిప్రజెంటెటివ్స్‌, మెడికల్‌ షాపు యజమానులు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. 

మెడికల్‌ రిప్రజెంటెటివ్స్‌ ద్వారా ఈ మందులను మార్కెట్‌లో చలామణి చేస్తున్నారని చెప్పారు. ఆస్పత్రిలో చేరిన కరోనా బాధితుడి కుటుంబ సభ్యులకు ఈ మందులు విక్రయిస్తున్నట్టు తెలిపారు. ఈ మెడిసిన్‌కు ఉన్న డిమాండ్‌ను ఆసరాగా చేసుకుని కృతిమ కోరత సృష్టించి.. లక్ష రూపాయలకు మెడిసిన్‌ను విక్రయిస్తున్నారని చెప్పారు. వైద్యులు కూడా పరిస్థితి విషమంగా ఉన్న కరోనా బాధితులకు ఫాబి ఫ్లూ ఇంజక్షన్స్‌ను వినియోగిస్తున్నారని చెప్పారు. ఇది గమనించిన ఈ ముఠా మెడిసిన్‌ను బ్లాక్‌ మార్కెట్‌లో విక్రయిస్తున్నట్టు వెల్లడించారు. 

మరిన్ని వార్తలు