హైదరాబాద్‌ : చెల్లి సమక్షంలో అక్కపై అత్యాచారం

14 Dec, 2019 12:13 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, హైదరాబాద్‌ : చెల్లెలిని చంపుతానని బెదిరించి ఆమె సమక్షంలోనే అక్కపై అత్యాచారం చేశాడో దుర్మార్గుడు. ఈ నెల 8వ తేదీన ఈ ఘటన జరగగా, అలస్యంగా వెలుగులోకి వచ్చింది. చాంద్రాయణగుట్ట పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గత ఆదివారం చార్మినార్‌ వెళ్లేందుకు హష్మబాద్‌ వద్ద ఆటో కోసం అక్కాచెల్లెలిద్దరూ వేచి చూస్తున్నారు. వీరిని చూసిన ఆటో డ్రైవర్‌ మహ్మద్‌ అమీర్‌ దగ్గరికి రాగా, చార్మినార్‌తో పాటు జహంగీర్‌ పీర్‌ దర్గాకు తీసుకెళ్లమని అక్కాచెల్లెళ్లు అడిగారు. అయితే సాయంత్రం సమయంలో దర్గాకు వెళ్లడం మంచిది కాదని, తెల్లారి తీసుకెళ్తానని వారిని వారించి, మాయమాటలు చెప్పి తన ఇంటికి తీసుకెళ్లాడు. ఇంట్లో వాళ్లు నిలదీయడంతో అమీర్‌ సోదరుడు మూసా కల్పించుకొని వీరిద్దరినీ నాంపల్లిలో దింపుతానని తన ద్విచక్రవాహనంపై తీసుకెళ్లాడు.

అక్కడ స్థానిక హోటల్‌గ్రాండ్‌లోని ఓయో రూం బుక్‌ చేసి, చెల్లెలిని చంపుతానని బెదిరించి అక్కపై పలుమార్లు అత్యాచారం చేశాడు. అనంతరం వాళ్లను ఉప్పుగూడ రైల్వేస్టేషన్‌ వద్ద వదిలేసి వెళ్లిపోయాడు. మరోవైపు అక్కాచెల్లెళ్లు కనిపించడం లేదంటూ 8వ తేదీన వారి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇదిలా ఉండగా, రైల్వేస్టేషన్‌ వద్ద తచ్చాడుతున్న అక్కాచెల్లెళ్లను చూసి రైల్వే పోలీసులు చాంద్రాయణగుట్ట పోలీసులకు సమాచారమందించగా, బాధితులను విచారించిన పోలీసులు  అత్యాచారం జరిగినట్టు తెలుసుకున్నారు. నాంపల్లిలోని హోటల్‌కు వెళ్లి విచారించగా, ఓయో రూమ్‌ కోసం నిందితుడు నకిలీ గుర్తింపు కార్డులిచ్చినట్టు గుర్తించారు.       

మరిన్ని వార్తలు