వజ్రాలంటూ భారీ మోసం.. ఇద్దరి అరెస్ట్

31 Jan, 2018 18:35 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: వజ్రాల వ్యాపారం పేరుతో అక్రమాలకు పాల్పడుతున్న ఇద్దరు నిందితులను హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అదపులోకి తీసుకున్నారు. మహ్మద్ సలామ్‌, మహ్మద్ సిద్దిఖీ అనే ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసి వారి వద్ద నుంచి రూ.1.15 కోట్లు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. వీటితో వజ్రాలను పరీక్షించే పరికరాలు, కొన్ని బంగారు ఆభరణాలను వారి వద్ద ఉన్నట్లు గుర్తించారు. నకిలీ వజ్రాలను అసలైనవిగా నమ్మించి మార్కెట్లో కోట్ల రూపాయలకు విక్రయిస్తున్నారని ప్రజలు జాగ్రత్తగా ఉండాలని పోలీసులు హెచ్చరించారు.

ఈ క్రమంలో ఓ వ్యక్తిని ఇద్దరు నిందితులు ఇటీవల కలిశారు. తమ వద్ద దాదాపు 4 కోట్ల విలువచేసే అతి ఖరీదైన వజ్రం ఉందని నమ్మించారు. అయితే తమకు అత్యవసరంగా డబ్బు అవసరం కావడంతో తక్కువ ధరకే విక్రయించేందుకు ఒప్పందం చేసుకున్నారు. బాధితుడు హాజీ రూ.1.15 కోట్లు చెల్లించి వజ్రాన్ని కొనుగోలు చేయగా అసలు విషయం బయటపడింది. నకిలీ వజ్రాన్ని తనకు అంటగట్టారంటూ హాజీ ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు.

మరిన్ని వార్తలు